కామారెడ్డి, మే 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతంలోని రోడ్లను జాతీయ రహదారులుగా మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రధాన రోడ్లను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి ప్రతిపాదనలను పంపడంతో పాటు బీఆర్ఎస్ ఎంపీల ద్వారా ఒత్తిడి తీసుకువచ్చింది. దీంతో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఆయా రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి నిధు లు మంజూరు చేస్తున్నది.
కామారెడ్డి జిల్లాలోని హెచ్ఎంబీ రోడ్డు, మద్నూర్-కోటగిరి-రుద్రూర్ రోడ్డు, కేకేవై రోడ్లను జాతీయ రహదారులుగా మా ర్చేందుకు ప్రతిపాదనలు పంపారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేములు ప్రశాంత్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్తో పాటు ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, నల్లమడుగు సురేందర్, గంప గోవర్ధన్ ఈ ప్రతిపాదనలకు మంజూరీ లభించడంతో పాటు నిధులు వచ్చేలా కృషి చేశారు. దీంతో (బాల్నగర్-మెదక్-బోధన్) రోడ్డు ఇప్పటికే జాతీయ రహదారిగా గుర్తించారు.
బాలనగర్ నుంచి మెదక్ వరకు ఉన్న రోడ్డును వెడల్పు చేసి ఎన్హెచ్-765డీ రోడ్డుగా మార్చారు. మెదక్ నుంచి రుద్రూర్ వరకు ఉన్న రోడ్డు వెడల్పునకు రూ.500 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటికే సర్వే పనులు పూర్తయ్యాయి. తాజాగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుంచి మద్నూర్ వరకు వయా రుద్రూర్, కోటగిరి, పొతంగల్ గ్రామాల మీదుగా వెళ్లే 38 కిలోమీటర్ల రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు సుముఖతను వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ రోడ్డును ఎన్హెచ్-63 రోడ్డుగా గుర్తించారు. ఈ మేరకు, 38 కిలోమీటర్ల పొడవు గల డబుల్ లైన్ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బుధవారం అభినందించారు.
ఉమ్మడి జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు ఎంపీ చూపిన చొరవపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. 38 కిలో మీటర్ల డబుల్ లైన్రోడ్డు నిర్మాణానికి రూ.750 కోట్లు మంజూరు కాగా, నాలుగు లైన్ల రోడ్డుగా ఇది అభివృద్ధి చెందనున్నది. ఈ రోడ్డు మంజూరు కోసం ఎంపీ బీబీ పాటిల్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి పలుమార్లు లేఖలు రాసి పలు దఫాలు ఆయనను ప్రత్యేకంగా కలిసి రోడ్డు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ శాఖ వారు నాలుగు లైన్ల రోడ్డు మంజూరుకు సుముఖత వ్యక్తం చేస్తూ ఆ శాఖ డీజీకి ఆదేశాలతో కూడిన లేఖ రాసింది. కాగా కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రోడ్డును సైతం జాతీయ రహదారిగా మార్చాలనే ప్రతిపాదనలు ఎన్హెచ్ఏఐ అధికారుల వద్ద ఉన్నాయి. ఆ ప్రతిపాదనలకు సుముఖత లభిస్తే కామారెడ్డి జిల్లా మీదుగా నాలుగు జాతీయ రహదారులు వెళ్లనున్నాయి. దీంతో ఈ ప్రాంతం రవాణా, వాణిజ్య పరంగా మరింత అభివృద్ధి చెందనున్నది.