డిచ్పల్లి, జనవరి 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చిందని రూరల్ ఎమ్మె ల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జక్రాన్పల్లి మండలం తొర్లికొండ గ్రామంలో 44వ నంబర్ జాతీయ రహదారి యానం నుంచి వేల్పూర్ మండలం జాన్కంపేట వరకు సుమారు రూ.21కోట్లతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ వీజీ గౌడ్తో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లో రూ.50 లక్షలతో నిర్మించిన రేణుకా ఎల్లమ్మ ఆలయం, వైకుంఠధామం, క్రీడామైదానాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాజిరెడ్డి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు 14 కిలోమీటర్ల పొడవున డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు రూ.21 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ప్రశాంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. మునిపల్లి నుంచి అర్గుల్ వరకు రూ. 8.70 కోట్లతో డబుల్ రోడ్డు, పడకల్, కలిగోట్ గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ. 3 కోట్ల నిధులు మంజూరుచేసినట్లు తెలిపారు. జక్రాన్పల్లి మండలానికి రోడ్లు, భవనాల శాఖ ద్వారా ఇప్పటి వరకు రూ. 36 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. గత పాలకులు గ్రామాల అభివృద్ధిని ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ప్రజల అవసరాలను సీఎం కేసీఆర్ గుర్తించి అభివృద్ధి పనులకు కోట్లాదిరూపాయలు కేటాయిస్తున్నారని తెలిపారు.రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తనముందున్న కర్తవ్యమని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ వీజీ గౌడ్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలుకావడం లేదని అన్నారు. జడ్పీటీసీలు బాజిరెడ్డి జగన్, తనూజా శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ కుంచాల విమల, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, వైస్ ఎంపీపీ ముస్కు తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట భోజన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శ్రీనివాస్, సర్పంచ్ రాజమల్లు, ఎంపీటీసీ రాజు, తొర్లికొండ సర్పంచ్ మాధవీలత, కో-ఆప్షన్ మెంబర్ అక్బర్ ఖాన్, ఎంపీడీవో లక్ష్మణ్, సర్పంచులు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.