నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 29 : ప్రజాపాలన కార్యక్రమాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను ప్రజలకు చేరువ చేసేందుకు నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు జిల్లావ్యాప్తంగా రెండో రోజు శుక్రవారం కొనసాగాయి. గ్రామాలు, వార్డుల్లో చేపట్టిన ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు.. దరఖాస్తు ఫారాలను నింపి అధికారులు, సిబ్బందికి అందజేశారు. పలు గ్రామాల్లో జిల్లా స్థాయి అధికారులు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రూరల్ నియోజకవర్గం పరిధిలోని కేశాపూర్, డిచ్పల్లి మండలంలోని ధర్మారం(బీ) గ్రామాల్లో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాలను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన దరఖాస్తులు, స్వీకరిస్తున్న దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమ వివరాలను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు.
దరఖాస్తు ఫారాలను పూరించే విషయంలో ప్రజలకు సహకారమందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. షామియానా, తాగునీటి సౌకర్యం కల్పించడం, దరఖాస్తులు నింపడానికి ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్లు, దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సంఖ్యకు అనుగుణంగా కౌంటర్ల సంఖ్యను పెంచాలని, సరిపడా దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. దరఖాస్తులను కొనుగోలు చేయకూడదని, గ్రామపంచాయతీ కార్యదర్శులు, మెప్మా ఆర్పీల ద్వారా దరఖాస్తులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మోస్రా మండలకేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను డీపీవో జయసుధ తనిఖీ చేశారు. ప్రజల నుంచి స్పందన ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకొని, పలు సూచనలు చేశారు.డొంకేశ్వర్ మండలం దత్తాపూర్లో, మాక్లూర్ మండలంలోని గుత్ప గ్రామంలో జడ్పీ చైర్మన్ దాదన్గనారి విఠల్రావు పాల్గొని మాట్లాడారు.
బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్తో దరఖాస్తు చేసుకోవచ్చు: ఆర్డీవో
బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్తో కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని బోధన్ ఆర్డీవో బీ.రాజాగౌడ్ పేర్కొన్నారు. రెంజల్ మండలంలోని రెంజల్, బాగేపల్లి, కునేపల్లి, నీలా, నవీపేట మండలంలోని కోస్లీ, నవీపేట గ్రామాల్లో ఆయన ప్రజాపాలనలో కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన అధికారులకు సూచనలు చేశారు. ఆర్మూర్ మండలంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆర్డీవో వినోద్ కుమార్ పరిశీలించారు. ఫత్తెపూర్, పిప్రి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.