నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 24 : నిజామాబాద్ జిల్లాలో రైతు నుంచి లంచం తీసుకొని రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన వీఆర్వోకు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ అవినీతి నిరోధక శాఖ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి పి.లక్ష్మి శనివారం తీర్పు వెల్లడించారు. ఏసీబీ మెదక్ రేంజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెల్లడించిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
నవీపేట్ మండలం బినోల గ్రామానికి చెందిన గొట్టిముక్కుల వెంకటి అనే రైతు తాను సాగుచేసుకుంటున్న 2.20 ఎకరాల ప్రభుత్వ (అసైండ్) భూమికి సంబంధించిన ఒక ఎకరం పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్/తహసీల్దార్ ఆర్డర్ కాపీని ఇచ్చేందుకు బినోల వీఆర్వో అయిన బంగారు హన్మాండ్లు రూ.15 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. రూ.10 వేలు బేరం కుదుర్చుకున్న రైతు.. లంచం ఇచ్చి పని చేయించుకోవడం ఇష్టం లేక నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీని కలిసి ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారుల సూచనల మేరకు 31 అక్టోబర్ 2013న గొట్టుముక్కుల వెంకటి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా.. వీఆర్వో హన్మాండ్లును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఈ కేసులో ఏసీబీ తరఫున స్పెషల్ ప్రాసిక్యూటర్ బి.కిశోర్ కుమార్ తన వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఏసీపీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పి.లక్ష్మి నిందితుడు బంగారు హన్మాండ్లుకు మూడేండ్ల కఠిన జైలు శిక్షతోపాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. జరిమానా చెల్లించని పక్షంలో మూడు నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.