నిజామాబాద్ క్రైం, మే 18: నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆటోనగర్కు చెందిన మహ్మద్ కలీం ఈనెల 16వ తేదీన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి మెదక్కు వెళ్లాడు. గురువారం ఇంటికి వచ్చి చూడగా.. మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉన్నది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాను ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దుండగులు దోచుకెళ్లారు. పక్క పోర్షన్లో ఉండే మహబూబ్ ఖాన్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతడి వద్ద నుంచి నగదును అపహరించుకుపోయారు. దుండగులు రూ.లక్షా80వేల నగదును దోచుకుపోయినట్లు బాధితులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మహబూబ్ ఖాన్ను కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించారు. ఈమేరకు రెండు ఘటనలపై బాధితులు ఆరో టౌన్లో ఫిర్యాదు చేశారు. కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఒకేసారి రెండిండ్లలో చోరీ జరగడంతో స్థానికులు భయాందోళనలు చెందుతున్నారు. రాత్రి సమయంలో పోలీసుల పెట్రోలింగ్ సరిగా లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో ఓ ఇంటికి తాళం వేసి ఉండడం, మరో ఇంట్లో వృద్ధుడు మాత్రమే ఒంటరిగా ఉన్నట్లు తెలిసిన వ్యక్తులు మాత్రమే చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని బాధితులు కోరుతున్నారు.