బాన్సువాడ, నవంబర్ 22: తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యమిస్తున్నది. సర్కారు ప్రోత్సాహంతో క్రీడాకారులు ఆటల్లో అదరగొడుతున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన కుమ్మరి సింధు షూటింగ్బాల్లో రాణిస్తూ జిల్లాకు వన్నె తెస్తున్నది. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో నిర్వహించిన షూటింగ్ బాల్ క్రీడల్లో కామారెడ్డి జిల్లా జట్టు తరఫున ఆడి సత్తా చాటింది. అండర్ -19 షూటింగ్ బాల్ క్రీడల్లో జిల్లా జట్టు తరఫున రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది.
కుటుంబ నేపథ్యం..
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పెద్దపొతంగల్ గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన కుమ్మరి విజయ-కిషన్ దంపతుల కుమార్తె కుమ్మ రి సింధు. బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం కావడంతో కరోనా సమయంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సింధు మాత్రం ఆటల్లో పట్టుసాధించేందుకు బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూనే చదువుకుంటూ, క్రీడల్లో ప్రాక్టీస్ చేస్తున్నది. రాబోవు రోజుల్లో జాతీయ స్థాయికి ఎదిగేలా షూటింగ్బాల్, వాలీబాల్ క్రీడల్లో శిక్షణ తీసుకుంటున్నది. సెప్టెంబర్లో గజ్వేల్లో నిర్వహించిన షూటింగ్బాల్లో కుమ్మరి సింధుతోపాటు జట్టు సభ్యులు ప్రతిభ కనబర్చి కామారెడ్డి జిల్లాను రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిపారు.
చాలా ఆనందంగా ఉన్నది..
షూటింగ్బాల్లో నేను నా సీనియర్ కీర్తనతో కలిసి ఆడాను. జిల్లా తరఫున ఆడినందుకు చాలా ఆనందంగా ఉన్నది. క్రీడల్లో నైపుణ్యం సాధించేందుకు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్, తల్లిదండ్రుల ప్రోత్సాహం చాలా ఉంది. రాబోయే రోజుల్లో జాతీయస్థాయి జట్టులో చోటు సంపాదించేందుకు శిక్షణ తీసుకుంటున్నాను. -సింధు, క్రీడాకారిణికి, బాన్సువాడ