గాంధారి, జనవరి 19: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తండాలో ఐదు వందల రూపాయల నకిలీ నోట్లు వెలుగు చూసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చద్మల్ తండాలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ రోజున లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విరాళాలు సేకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా భక్తులు సమర్పించిన కానుకలు, డబ్బులను తండాలో అవసరం ఉన్న వారికి వడ్డీకి ఇస్తారు. ఆలయానికి సంబంధించిన డబ్బులు సుమారు కోటి రూపాయల వరకు ఉన్నట్లు తెలిసింది.
ఈ బాధ్యతను ఆలయ కమిటీలోని ఓ వ్యక్తి చూసుకుంటాడు. వడ్డీ డబ్బులను జాతర సమయంలో వసూలు చేసి, జాతర ముగిసిన అనంతరం తిరిగి వడ్డీకి ఇస్తారు. గతంలో డబ్బులు తీసుకున్న వారు ఈ ఏడాది జాతరకు ఇచ్చినట్లు తెలిసింది. ఈసారి లక్ష్మమ్మ ఆలయ వార్షికోత్సవం ముగిసిన అనంతరం డబ్బులను కొందరు తీసుకోగా.. అందులో నకిలీ నోట్లు వచ్చాయని తెలిసింది. ప్రతి యాభై వేల రూపాయల నోట్ల కట్టలో మూడు, నాలుగు నకిలీ నోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై పలువురు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసులు తండాకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.