ఆర్మూర్టౌన్, డిసెంబర్ 22 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం భారీ చోరీ జరిగింది. కారులోంచి రూ.90 లక్షల విలువైన కిలోన్నర బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మహాలక్ష్మీ కాలనీలో నివసించే డాక్టర్ ఈశ్వర్చంద్ర మెడికల్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పాత పోలీస్ స్టేషన్ వద్ద క్లినిక్ నిర్వహిస్తున్నారు. పట్టణంలోని కో-ఆపరేటివ్ బ్యాంకులోని లాకర్లో ఉన్న కిలోన్నర బంగారు ఆభరణాలను అవసరం నిమిత్తం శుక్రవారం మధ్యాహ్నం తీసుకున్నారు. బ్యాంకు నుంచి కారులో ఇంటికి బయల్దేరిన ఆయన మార్గమధ్యంలో ఉన్న మహాలక్ష్మీ మందిరం వద్ద కారు ఆపి దర్శనం చేసుకునేందుకు లోనికి వెళ్లాడు.
దర్శనం అనంతరం బయటికి వచ్చిన ఆయనకు కారులో ఉంచిన బంగారు ఆభరణాల బ్యాగు కనిపించలేదు. బ్యాగు అపరహరణకు గురైందని గ్రహించిన ఈశ్వర్ చంద్ర ఆందోళనకు గురై పోలీసు స్ట్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఒకేసారి బ్యాంకు లాకర్ నుంచి కిలోన్నర బంగారు ఆభరణలు తీసుకురావడం, ఆ తర్వాత పూజ చేయడానికి ఆలయానికి వెళ్లడం తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీ జరిగిన విషయం తెలియగానే సీపీ ఆదేశాల మేరకు అదనపు డీసీపీ జయరాం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆర్మూర్ ఏసీపీ, సీఐతో పాటు జిల్లాలోని టాస్క్ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో పట్టణంలో గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు వేలిముద్రల నిపుణులు కారును పరిశీలించి ఆధారాలను సేకరించారు.