ఖలీల్వాడి, అక్టోబర్ 20: తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఇందూరు వాకిళ్లన్నీ పూదోటలయ్యాయి. భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను నగర ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇండ్ల వద్ద అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు శోభాయాత్రగా మినీ ట్యాంక్బండ్ వద్దకు తరలివచ్చారు. బృందాలుగా పాటలు పాడుతూ లయబద్ధంగా బతుకమ్మ ఆడారు. వేడుకలకు ముఖ్య అతిథిగా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత హాజరై సందడి చేశారు. మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మరుగున పడుతున్న తెలంగాణ సంస్కృతికి జాగృతి ఆధ్వర్యంలో ఊపిరి పోశామన్నారు. బతుకమ్మ సంబురాలను అన్ని దేశాల్లో నిర్వహించుకునేలా విశ్వవ్యాప్తం చేశామన్నారు. మన సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. ఇందుకోసం పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డా సంబురంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ సందర్భంగా ఏటా సీఎం కేసీఆర్ చీరలను కానుకగా అందిస్తున్నారని గుర్తుచేశారు.
పూలు, ప్రకృతిని పూజించే మన సంస్కృతి ఎంతో గొప్పదని, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తించడం గర్వకారణమన్నారు. బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని తెలిపారు. వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా, మేయర్ నీతూ కిరణ్, మాజీ మేయర్ ఆకుల సుజాత, విశాలినీరెడ్డి, అపర్ణ, సునీత, మంజులాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.