రుద్రూర్, ఫిబ్రవరి 26: బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి కాన్వాయిలోని ఓ కారు ఆటోని ఢీకొనగా డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఆటో డ్రైవర్ను 108 అంబులెన్సులో దవాఖానకు తరలించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. కోటగిరిలో సోమవారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండడంతో..ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి తన కాన్వాయితో బోధన్ నుంచి రుద్రూర్ వైపు వెళ్లారు. రుద్రూర్ గ్రామశివారులో ఎమ్మెల్యే కాన్వాయిలోని ఓ వాహనం అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది.
దీంతో ఆటో ధ్వంసంకాగా డ్రైవర్ షేక్ ముబిన్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాన్సువాడ మండలం కొత్తాబాది గ్రామానికి చెందిన షేక్ ముబీన్ కాలు, చేయి విరిగినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రదేశంలోనే ఎమ్మెల్యే కాన్వాయిలోని వాహనాన్ని వదిలేసి వెళ్లిపోవడంపై స్థానికుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటోను అజాగ్రత్తగా నడిపి కారును ఢీకొట్టాడంటూ కారు డ్రైవర్ భూక్యా సతీశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.