ఎల్లారెడ్డి రూరల్, డిసెంబర్ 13 : అదుపుతప్పిన ద్విచక్ర వాహనంపై నుంచి పడి బాలుడు మృతి చెందిన సంఘటన ఎల్లారెడ్డి మండలం అడ్విలింగాల గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకున్నది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామానికి చెందిన నర్సింలు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబం కామారెడ్డి పట్టణ శివారులోని దేవీవిహార్లో నివాసముంటున్నారు. నర్సింలు కుమారుడు సాయినితిన్ (14), అతని మిత్రుడు ఎరుకల తరుణ్తో కలిసి బైక్పై ఎల్లారెడ్డికి వస్తున్నారు. అడ్విలింగాల్ మూలమలుపువద్ద బైక్ అదుపు తప్పడంతో బైక్ నడిపిస్తున్న తరుణ్ అక్కడే పడిపోయాడు. కానీ బైక్ వెనుక కూర్చున్న సాయినితిన్ మాత్రం ఎగిరిపడడంతో అతని నడుము, వీపు, చేతులకు గాయాలై ఎదురుగా ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు కిందికి వెళ్లిపోయాడు. తీవ్రగాయాలైన ఇద్దరిని కామారెడ్డి దవాఖానకు తరలించగా సాయినితిన్ మృతిచెందినట్లు ఎల్లారెడ్డి ఎస్సై గణేశ్ తెలిపారు.