నిజామాబాద్, జనవరి10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):గేమ్చేంజర్గా నిలుస్తున్న రైతుబంధు పథకం సరికొత్త అధ్యాయానికి చేరుకుంది. పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్నదాతలకు ప్రభుత్వం అందించిన పెట్టుబడి సాయం రూ.50వేల కోట్లకు చేరింది. వానకాలం, యాసంగి కలిపి నాలుగేండ్లలో 8 పంటసీజన్లకు నగదును ప్రభుత్వం అందజేసింది. దేశంలో ఎక్కడా లేనవిధంగా బృహత్ పథకాన్ని అమల్లోకి తెచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబాంధవుడిగా నిలుస్తున్నారు. పలు రాష్ర్టాల బడ్జెట్తో సమానమైన మొత్తాన్ని నాలుగేండ్లలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయడం చిన్న విషయం కాదు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో గడిచిన నాలుగేండ్లలో కర్షకులకు అందిన రైతుబంధు సాయం అక్షరాలా రూ.3904.91 కోట్లు. ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో ప్రతి సీజన్లో ఐదున్నర లక్షలమంది ఏ రంది లేకుండా పంటలు సాగుచేసుకుంటున్నారు.
రైతుబంధు పథకం సరికొత్త అధ్యాయానికి చేరుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత నేటి వరకు పంపిణీ చేసిన మొత్తం విలువ రూ.50వేల కోట్లు. దాదాపు నాలుగేండ్ల కాలంలోనే రైతులోకానికి సీఎం కేసీఆర్ అందించిన పెట్టుబడి సాయం దేశంలోని అనేక రాష్ర్టాల వార్షిక బడ్జెట్కు సరిసమానం. రైతుల మేలుకోసం పరితపిస్తున్న సీఎం కేసీఆర్ 2018, మే 10వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లి – ఇందిరానగర్ వద్ద రైతుబంధు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. మధ్యవర్తుల బెడద లేకుండా నేరుగా రైతులకు సర్కారు నుంచి వచ్చే నగదు సాయం ప్రపంచంలో తెలంగాణలోనే మొదటిది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభు త్వం తప్ప కర్షకుల పెట్టుబడికి సాయం అందిస్తున్న ప్రభుత్వాలు దేశంలో ఒక్కటీ లేదంటే అతిశయోక్తి లేదు. కరెంట్ చార్జీలు, ఇతరత్రా పన్నుల రూపంలో రైతుల నుంచి వసూలు చేస్తున్న ప్రభుత్వాలే అధికంగా ఉన్నాయి. రైతు నుంచి ఆదాయాలు సమకూర్చుకుంటున్న ప్రభుత్వాలు ఓ వైపు ఉంటే… రైతులకు నయా పైసా భారం లేకుండా చేసి, వారు సాగు చేసేందుకు ప్రభుత్వమే నగదు రూపంలో సాయం చేయడం ఓ రికార్డు. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలుగా విజయవంతంగా సాగిన రైతుబంధు పథకం అమలులో రాష్ట్రంలో రూ. 50వేల కోట్లు పంపిణీ జరుగగా… ఉమ్మడి జిల్లాలో ఈ మొత్తం విలువ రూ.3904.91కోట్లుగా ఉండడం విశేషం.
నిజామాబాద్లో రూ.1992 కోట్లు..
రైతుబంధు పథకం ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. 2019 వానకాలం నుంచి ఎకరానికి రూ.5వేల సాయాన్ని సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. చెక్కులకు బదులుగా రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. 2018 వానకాలంలో 2.37లక్షల మంది రైతులకు రూ.204.24 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. 2019 యాసంగిలో 2.29లక్షల మందికి రూ. 204.44 కోట్లు, 2019 వానకాలంలో 2.36లక్షల మందికి రూ.258.93 కోట్లు, 2020 యాసంగిలో 2.17 లక్షల మందికి రూ.237.6 4 కోట్లు, 2020 వానకాలంలో 2.53 లక్షల మందికి రూ.270.73 కోట్లు, 2021 యాసంగిలో 2.56లక్షల మందికి రూ.272.03 కోట్లు, 2021 వానకాలంలో 2.61 లక్షల మందికి రూ.271.68 కోట్ల మేర కేటాయింపులు జరిగాయి. సాగుకాలానికి ముందే రైతుబంధు చెల్లింపులను ప్రభుత్వం పూర్తిచేసింది. 2022 యాసంగికి 2లక్షల 67వేల 44 మందికి రైతుబంధు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.272.72 కోట్లు కేటాయించింది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతల్లో పెట్టుబడి సాయం కింద నిజామాబాద్ జిల్లా రైతులకు అందిన మొత్తం విలువ రూ. 1992 కోట్లుగా ఉంది.
కామారెడ్డిలో రూ.1912 కోట్లు…
రైతుబంధు పథకం మొదలైనప్పటి నుంచి నేటి వరకు కామారెడ్డి జిల్లాలో రెండున్నర లక్షల మంది రైతులు అర్హులుగా ఉన్నారు. పథకం తొలిరోజుల్లో 2లక్షల 43 వేల 760 మంది ఉండగా ఇప్పుడీ సంఖ్య 2లక్షల 81వేల 96 మందికి చేరింది. నిజామాబాద్ జిల్లాతో పోలిస్తే కామారెడ్డి జిల్లాలో రైతుబంధు లబ్ధిదారులు అత్యధికంగా ఉన్నారు. నగదు పంపిణీ మొత్తంలో కామారెడ్డి జిల్లాతో పోలిస్తే నిజామాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది. తొలి విడుతలో 2.43 లక్షల మందికి రూ.196.57 కోట్లు, రెండో విడుతలో 2.33లక్షల మందికి రూ.197.79 కోట్లు, మూడో విడుతలో 2.41 లక్షల మందికి రూ.252.76 కోట్లు, నాలుగో విడుతలో 2.22లక్షల మందికి రూ.228.78 కోట్లు, ఐదో విడుతలో 2.55లక్షల మందికి రూ.257. 27 కోట్లు, ఆరో విడుతలో 2.61 లక్షల మందికి రూ. 259.48 కోట్లు, ఏడో విడుతలో 2.71లక్షల మందికి రూ.259.87 కోట్లు, ఎనిమిదో విడుతలో 2.81లక్షల మంది రైతులకు రూ.260.39కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రైతులందరికీ వారి బ్యాంక్ అకౌంట్లలో ఎకరానికి రూ.5వేలు చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఎనిమిది విడుతల్లో కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా కర్షకులకు పంపిణీ చేసిన నగదు మొత్తం విలువ రూ.1912కోట్లు కావడం విశేషం.
ఉభయ జిల్లాల్లోరూ.4వేల కోట్లు పంపిణీ..
2018 వానకాలం సీజన్ నుంచి మొదలుకొని ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం ద్వారా పంపిణీ చేసిన మొత్తం విలువ అర లక్ష కోట్ల రూపాయలు. రైతు సాధక బాధకాలను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, స్వయంగా రైతుగా ఎదుర్కొన్న అనుభవాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎక్కడా లేని విధంగా పెట్టుబడి సాయాన్ని తీసుకువచ్చారు. రైతుబంధుతో అనేక మంది కర్షకుల కన్నీళ్లు, కష్టాలను తొలగించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా 5లక్షల 48వేల140 మంది రైతులకు మేలు చేకూరుతున్నది. సాగు భూమి ఉండి, పట్టాదారు పాస్బుక్కులు కలిగి ఉన్నవారందరికీ పెట్టుబడి సాయం అందుతున్నది. రెండు జిల్లాల్లో ఎనిమిది విడుతల్లో అమలైన రైతుబంధు పథకం మొత్తం దాదాపుగా రూ.4వేల కోట్లుగా ఉంది. కామారెడ్డి జిల్లాలో రైతుబంధు ద్వారా లబ్ధి పొందుతున్న రైతుల సంఖ్య ఎక్కువగా ఉంది. కామారెడ్డితో పోలిస్తే నిజామాబాద్ జిల్లాలో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండడం తో పెట్టుబడి సాయం ఎక్కువగానే మం జూరవుతున్నది.
రైతును రాజు చేస్తున్న కేసీఆర్..
రాష్ట్రంలో ఒకప్పుడు రైతు పరిస్థితి దయనీయం. కాంగ్రెస్, టీడీపీ పాలకుల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకునే వారే కరువు. సాగుకు యోగ్యమైన భూములున్నప్పటికీ సాగు నీరు లేక, కరెంట్ రాక, పెట్టుబడికి పైసలు చాలక… పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. స్వరాష్ట్రంలో ఒక్కో సమస్యను సీఎం కేసీఆర్ శాశ్వతంగా పరిష్కరించారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం గడిచిన ఏడేండ్లుగా పాటుపడుతున్నది. అప్పుల బాధతో రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తెలంగాణను పునర్నిర్మిస్తున్నారు. రైతులకు వెన్నుదన్నుగా ఉండడానికి తీసుకువచ్చిన అనేక రైతు సంక్షేమ పథకాలు ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నయి. ముఖ్యంగా పంటలు పండించడానికి కావాల్సిన పెట్టుబడి రైతుబంధు సహా 24గంటల కరెంట్ను సరఫరా చేస్తూ కర్షక సంక్షేమ ప్రభుత్వం అంటూ కోట్లాది మంది రైతుల చేత మెప్పుపొందుతున్నది. కరోనా వంటి గత్తరలు తరుముతున్నా… రైతుకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
కేసీఆర్ సారు సల్లంగ ఉండాలి
నాలాంటి రైతులందరికీ నాలుగేండ్లుగా రైతుబంధువుగా ఉన్న కేసీఆర్ సారే ఎప్పటికీ సీఎంగా ఉండాలి. మా నాన్న వాళ్లు ఏడుగురు అన్నదమ్ములు. ఏడుగురి పొత్తుల నాలుగెకరాల భూమి ఉంది. గతంలో పంట వేసే టైం వచ్చిందంటే పెట్టుబడి కోసం ఊర్ల పటేల్తాటికో, సౌకారితాటికో తిరుగుతుంటిమి. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ పెట్టుబడి కింద ఇస్తున్న రైతుబంధు డబ్బులు పంటల సాగుకు సాయమవుతున్నయ్. గప్పట్ల సౌకారీ, పటేళ్లతాట తెచ్చిన డబ్బులు పంట అమ్మినంక వారికి కట్టేతందుకే సరిపోకపోయేవి. కానీ ఇప్పుడు సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధుతో సాగు ఖర్చులకు ఇబ్బందులు పోయినయ్. రైతుబంధు ఇస్తున్న సీఎం కేసీఆర్ పదికాలాల పాటు సల్లంగ ఉండాలి. రైతుబంధు డబ్బులు కూలీలు, ట్రాక్టర్ ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి.
మా పెద్దన్న కేసీఆర్..
నా పేరు సాయన్న. మాది కోటార్మూర్. నాకు ఎకరం 20 గుంటల భూమి ఉన్నది. ఆనకాలం రూ.7500, యాసంగిల రూ.7500 బ్యాంకు ఖాతాల పడుతున్నయ్. ఆ పైసల్ని కైకిళ్లకు వాడుతున్న. సీఎం కేసీఆర్ రాక మునుపు పంట ఏద్దామంటే మస్తు ఇబ్బంది అయితుండె. పైసల్లేక వడ్డీలకు ఇచ్చేటోళ్ల దగ్గరికి, సౌకారీల దగ్గరికి వెళ్లి అప్పు తెచ్చుకొనేటోడ్ని. అప్పుజేసి పంట ఏసి నా కరంటు సక్కంగ ఉండకపోతుండె. ఇత్నాలు, మందుల కోసం దుకాణాల దగ్గర పొద్దాంత లైన్ల నిల్చుండేటోళ్లం. ఇప్పుడు కేసీఆర్ జేసుట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తలేదు. నిత్తెం పొద్దాంత కరం టు ఉంటున్నది. దుకాణాలకు ఎప్పుడు పోయినా ఇత్నాలు, మం దులు దొరుకుతున్నయ్. టీడీపీ, కాంగ్రెసోళ్లు ఉన్నప్పుడు మా రైతులకు కష్టాలే ఎక్కువ. మా పొలంల సీడ్ వరి పండిస్తున్న. మాలాంటి రైతును రాజును చేయాలని చూస్తున్న సీఎం కేసీఆర్ మాకు పెద్దన్న అయ్యిండు. ఆయనను ఎన్నటికీ మర్చిపోము.