నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 14: రెండు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు బోధన్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. సరస్వతీ నగర్కు వెళ్లే రహదారిలో మొత్తం నీరు నిలిచింది. వేంకటేశ్వర కాలనీ జలమయమైంది. అనీల్ టాకీస్ చౌరస్తాలో షర్బతీ కెనాల్ పూర్తినీటి మట్టంతో పారింది. బోధన్కు సాగు, తాగు నీరందించే బెల్లాల్ చెరువు పూర్తిగా నిండి అలుగు పారుతున్నది. పాండు చెరువు సైతం అలుగు పారుతున్నది. వర్షం కారణంగా నిలిచిన నీటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు వెల్లడించారు. బోధన్ మండలంలోని సాలూరా వద్ద మంజీరా నది ప్రవహిస్తున్నది. రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరినదిలో నీటి ఉధృతి కొనసాగుతున్నది. కందకుర్తిలో అంగన్వాడీ కేంద్రం చుట్టూ నీరు నిలిచి పోయింది. బోర్గాం, కందకుర్తి, రెంజల్, దూపల్లి, నీలా తదితర గ్రామాల్లో సాగుచేస్తున్న సోయా, పత్తి, వరి పంటల్లో నీరు నిలిచింది. మండలంలో 61.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాంచందర్ తెలిపారు. కమ్మర్పల్లిలో మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 54.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు చెరువుల్లోకి నీరు చేరుతున్నది. వరద కాలువ, తూము కాలువలో యువకులు చేపలు పడుతూ కనిపించారు. మోర్తాడ్లోని మొండివాగు నిండుగా ప్రవహిస్తున్నది.
ఈనీరు పెద్దవాగులోకి రావడంతో అది జలకళ సంతరించుకుంది. ధర్మోరా మొండివాగు నిండుగా ప్రవహిస్తూ పెద్దవాగులోకి రావడంతో పాలెం చెక్డ్యాం నిండి పారుతున్నది. 42 మి.మీ వర్షం కురిసిందని తహసీల్దార్ శ్రీధర్ తెలిపారు. నవీపేట మండలం జన్నేపల్లి వాగుతోపాటు తుంగిని, మాటు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నది. మాక్లూర్ మండలంలో మంగళవారం రాత్రి 16 మి.మీ వర్షం కురిసిందని డిప్యూటీ తహసీల్దార్ సుధారాణి తెలిపారు. ఆర్మూర్లోని లోతట్టు ప్రాంతాలను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్ గంగామోహన్చక్రు, టీఆర్ఎస్ నాయకుడు పండిత్ పవన్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్ పరిశీలించారు. నందిపేట్ మండల కేంద్రంతోపాటు గ్రామా ల్లో బుధవారం 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తల్వే ద వాగు ప్రవహిస్తున్నది. వాగుపై నిర్మించిన చెక్ డ్యాం నిండి పైనుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎడపల్లి మండల కేంద్రం శివారులోని పెద్దవాగు లో నీరు పారుతోంది. పులి చెరువు పూర్తిగా నిండి ఫీడర్ ఛానల్ ద్వారా నీరు పెద్ద చెరువుకు పారుతోంది. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకులకొండూర్, పాల్ద గ్రామాల శివార్లలో పూలాగ్ వాగుపై నూతనంగా నిర్మించిన చెక్డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. ఒక్కో చెక్డ్యాం లో 10 ఫీట్ల లోతువరకు నీరు నిల్వ ఉంటుందని, భూగర్భ జలమట్టం పెరుగుతుందని కొండూర్ సర్పంచ్ మెట్టు అశోక్ అన్నారు. చందూర్ మండలంలోని ఘన్పూర్లో వర్షపునీరు నిలువడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడ్డారు. చందూర్ పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. కోటగిరి మండలంలో మంగళవారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురవడంతో చెరువులు నిండి పొంగిపొర్లుతున్నాయి. వ్యవసాయభూముల్లో వేసిన వరినాట్లు నీటమునిగాయి. కోటగిరి-ఎత్తొండ గ్రామాల మధ్య వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రూర్ మండలంలో వాగులు, కాలువలు నిండుగాప్రవహిస్తున్నాయి. 49.6 మి.మీ.వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ ముజీబ్ తెలిపారు.