నిజామాబాద్ క్రైం, జనవరి 1 : ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆంక్షల నేపథ్యంలో శుక్రవారం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు శుక్రవారం అర్ధరాత్రి వరకు జిల్లాలో పర్యటించారు. సీపీ ఇటీవలే విధుల్లో చేరడంతో మొట్టమొదటి సారి ఆయన జిల్లాలో సిబ్బంది పనితీరును పరిశీలించేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహించారు. నిజామాబాద్, బోధన్ డివిజన్ల పరిధిలో పర్యటించిన ఆయన స్వయంగా పలు చోట్ల సిబ్బందితో కలిసి తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడిషనల్ డీసీపీ డాక్టర్ వినీత్ పర్యవేక్షణలో ఏసీపీ వెంకటేశ్వర్లు ఇతర సీఐలు, ఎస్సైలు, స్పెషల్ పార్టీ, ట్రాఫిక్ సిబ్బంది అర్ధరాత్రి 2 గంటల వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్లలో మొత్తం 90 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో 38 కేసులు
కామారెడ్డి , జనవరి 1: కామారెడ్డి జిల్లా పరిధిలో శుక్రవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 38 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిధిలో మొత్తం 38 కేసులు నమోదు చేశారు.
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో 7 కేసులు, దేవునిపల్లి పీఎస్ పరిధిలో13, మాచారెడ్డి పీఎస్ పరిధిలో 2, ఎల్లారెడ్డి పీఎస్ పరిధిలో ఒకటి, నాగిరెడ్డిపేట్లో 4, బాన్సువాడలో 3, పిట్లంలో 8 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి.