పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు దృష్టి సారించారు. పరీక్షల్లో మంచి గ్రేడ్ సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఏప్రిల్ 3 నుంచి వార్షిక పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. గతంలో 11 పేపర్లతో పరీక్షను నిర్వహించగా, ఈసారి మాత్రం ఆరు పేపర్లే ఉండనున్నాయి. దీంతో ఒకవైపు విద్యార్థులను పరీక్షలకు సంసిద్ధులను చేస్తూనే.. మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రభుత్వం సైతం పలు విధాలా కసరత్తు చేస్తున్నది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతుల నిర్వహణ, వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యేలా అభ్యాస దీపికలను అందజేసింది. దీంతో పాఠాలను సులువుగా అర్థం చేసుకొని పరీక్షలు బాగా రాసే అవకాశమున్నది. మరోవైపు పదో తరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో టెన్షన్ నెలకొన్నది. ర్యాంకులు, జీపీఏలంటూ విద్యార్థులపై ఒత్తిడి తేకుండా పరీక్షలకు సిద్ధం చేయాలని తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
– ఖలీల్వాడి / కామారెడ్డి / ఎల్లారెడ్డి రూరల్, మార్చి 13
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి వార్షిక పరీక్షల నిర్వహణ నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. వందశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నది. అదేవిధంగా ప్రతి రోజూ విద్యార్థులకు అల్పాహారం కూడా అందజేస్తున్నది. మరోవైపు విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడి తగ్గించేందుకు, పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యి.. పరీక్షలు బాగా రాసేలా అభ్యాస దీపికలను అందించింది. మరో 20 రోజుల్లో వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు కామారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు అ న్ని చర్యలు తీసుకుంటున్నారు. సమయం దగ్గర పడుతుండడం తో కేంద్రాలను అన్ని సౌకర్యాలతో సిద్ధం చేస్తున్నారు. ఇంతకుముందు 11పేపర్లకు పరీక్షలు జరిగితే ఈసారి ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించనుండడం గమనార్హం.
జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు అన్ని కలుపుకొని 11,899 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 5,902 మంది బాలురు, 5,997 మంది బాలికలు ఉన్నారు. 185 జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 6,461 మంది విద్యార్థులు,19 కేజీబీవీ పాఠశాలల్లో 747 మంది, 6 మోడల్ స్కూళ్లలో 591 మంది, 13 గురుకుల పాఠశాలల్లో 965 మంది, ఏడు బీసీ గురుకులాల్లో 497, ఆరు మైనార్టీ గురుకులాల్లో 256, గిరిజన గురుకులాల్లో 225, 13 సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో 965, ఎయిడెడ్ స్కూళ్లలో 27 మంది, 54 ప్రైవేట్ పాఠశాలల్లో 2,130 మంది విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9,769 మంది విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా ఉన్నారు.
పరీక్షల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా జిల్లా విద్యాశాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తం గా 63 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్లయింగ్ స్కాడ్స్, ఐదుగురు రూట్ ఆఫీసర్లు, 10మంది సిట్టింగ్ స్కాడ్స్, 595 మంది ఇన్విజిలేటర్లు వీరితోపాటు 63 మంది చీఫ్ సూపరింటెండెంట్స్, 63 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇద్దరు అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, 22 మంది కస్టోడియన్స్, 22 మంది జాయింట్ కస్టోడియన్ ఆఫీసర్స్, కలెక్టర్, జేసీ, హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాలు పర్యవేక్షించనున్నాయి. వీరితోపాటు రెవెన్యూ, పోలీస్, వైద్య విభాగం ఇతర విభాగాల నుంచి పరీక్షల విధుల్లో పాల్గొంటున్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు, జిరాక్స్ సెంటర్ల మూసివేత, ప్రతి సెంటర్ వద్ద కానిస్టేబుళ్లను నియమించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 63 కేంద్రాలు ఉండగా 57 ప్రభుత్వ పాఠశాలలు, 6 ప్రైవేట్ పాఠశాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. ఎలాంటి మాస్కాపీయింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. విద్యార్థులు ప్రశాంతంగా రాసేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నాం. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలి.
-రాజు, డీఈవో, కామారెడ్డి