108 | ఫోన్ చేసిన వెంటనే కుయ్ కుయ్ అంటూ ఇంటిముందు వాలే 108 అంబులెన్సులు ఆపత్కాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించి అందరి మన్ననలు పొందుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణులకు విశిష్ఠ సేవలను అందిస్తున్నాయి. వాహనాల్లో పనిచేసే సిబ్బంది సైతం ఏండ్లపాటు అనుభవం సంపాదించడంతో డాక్టర్లతో సమానంగా సేవలు అందిస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో ‘108 అంబులెన్సులు’ 17 అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 మంది టెక్నీషీయన్లు, 43 మంది పైలట్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరు రాత్రి, పగలు అనే తేడా లేకుండా 24/7 సేవలందిస్తున్నారు. ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే వెళ్లి బాధితులను స్థానిక దవాఖానలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ఎంతో మంది క్షతగాత్రులను ప్రాణాపాయం నుంచి తప్పించారు. దీంతోపాటు ఎక్కువగా గర్భిణులకు 108 ద్వారా విశిష్ట సేవలు అందిస్తున్నారు. మారుమూల గ్రామాల్లో ఉండే గర్భిణులు పురిటి నొప్పులతో బాధపడినప్పుడు వారి కుటుంబాల్లో ధైర్యం నింపుతున్నారు.
అత్యవసరమైనే అంబులెన్స్లోనే సాధారణ ప్రసవం చేసి శభాష్ అనిపించుకుంటున్నారు. అనంతరం తల్లీబిడ్డలను మెరుగైన చికిత్స కోసం దవాఖానలో అడ్మిట్ చేస్తున్నారు. ప్రైవేటు వైద్యశాలల్లో అనవసర ఆపరేషన్లను నివారించేందుకు ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరుగాలని జిల్లా యంత్రాంగంతోపాటు ఆరోగ్యశాఖ వారు కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 108 అంబులెన్స్ సిబ్బంది గర్భిణులను క్షేమంగా డెలివరీల కోసం సర్కారు దవాఖానలకే తరలిస్తుండడంతో సర్కారు లక్ష్యం కూడా నెరవేరుతున్నది.
ఇటీవల బడాపహాడ్కు వెళ్తుండగా తెల్లవారుజామున డీసీఎం బోల్తా కొట్టిన ఘటనలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. 108 సిబ్బందికి సమాచారం అందిన వెంటనే హుటాహుటిన నాలుగు వాహనాలు ప్రమాద స్థలానికి వెళ్లి క్షతగాత్రులను జిల్లా దవాఖానకు తరలించారు. ఇలా అత్యవసర సమయాల్లో నిర్లక్ష్యం చేకుండా స్పందిస్తూ ప్రతినెలా రోడ్డు ప్రమాద బాధితులతోపాటు గర్భిణులకు మెరుగైన వైద్యం అందించేందుకు సహకారం అందిస్తున్నారు.
బాధితుల్లో ఆనందం.. ఎంతో సంతృప్తినిస్తుంది..
నేను 17 ఏండ్లుగా 108 అంబులెన్స్ టెక్నీషియన్గా పనిచేస్తున్నా. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎవరు ఫోన్ చేసినా వెంటనే వెళ్లి బాధితులను దవాఖానకు తరలిస్తాం. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో దవాఖానకు తరలించడం ద్వారా అనేకమంది ప్రాణాలు నిలబెట్టుకున్నారు. బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తంచేసినప్పుడు ఎంతో సంతృప్తిగా ఉంటుంది. అంబులెన్స్లోనే ప్రథమ చికిత్స చేస్తుంటాం. ఒక్కోసారి గర్భిణులకు ప్రసవం కూడా చేయాల్సి ఉంటుంది.
–సురుకుట్ల లక్ష్మణ్, టెక్నీషియన్
అన్ని సమయాల్లో అప్రమత్తంగా ఉంటాం..
మేను పనిచేసేదే అత్యవసర సమయంలో సేవలందించేందుకు. ప్రమాదాలు చెప్పి రావు. అందుకే అన్ని వేళల్లో అప్రమత్తంగా ఉంటాం. ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి బాధితులను వీలైనంత త్వరగా దవాఖానకు తరలిస్తాం. 15 ఏండ్లుగా ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టామన్న సంతృప్తి ఉన్నది. కొందరు చిన్నచిన్న సమస్యలు ఉన్నా ఫోన్ చేసి ఇబ్బంది పెడతారు. అలాంటప్పుడు కొంత బాధగా ఉంటుంది.
–దేవినేని కేశవ్, పైలట్