నిజామాబాద్ నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు వెచ్చించించిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని ప్రకటించారు. శనివారం నిజామాబాద్ నగరంలో సుడిగాలి పర్యటన చేసిన రామారావు.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.20 కోట్లతో నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జిని ప్రారంభించారు. రూ.50 కోట్లతో నిర్మించనున్న ఇందూర్ కళాభారతికి శంకుస్థాపన చేశారు. అంతకు ముందు కాకతీయ సాండ్ బాక్స్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. స్టార్టప్ ప్రతినిధులు, రైతులతో ముఖాముఖిలో స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై తనదైన శైలిలో విరుచుకుపడిన కేటీఆర్.. తెలంగాణపై కేంద్రం చూపుతున్న వివక్షను, మోదీ సర్కారు చేసిన దుర్మార్గాలను కళ్లకు కట్టినట్లు వివరించారు.
నిజామాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్ నగరంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటన సందడిగా సాగింది. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టు నుంచి మంత్రి వేముల, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, షకీల్, మల్లయ్య యాదవ్తో కలిసి నగరానికి చేరుకున్నారు. అనంతరం నేరుగా బోర్గాంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో కాకతీయ సాండ్ బాక్స్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. అక్కడినుంచి నేరుగా రైల్వే అండర్ బ్రిడ్జి చెంతకు చేరుకొని ఆర్యూబీని ప్రారంభించారు. అనంతరం పాత కలెక్టరేట్ స్థలంలో రూ.50కోట్లతో నిర్మించబోతున్న ఇందూరు కళాభారతి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, గణేశ్గుప్తా, జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు, ఎమ్మెల్సీలు రాజేశ్వర్, వీజీ గౌడ్, ఎంపీ సురేశ్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పురపాలక మంత్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్థానిక ఎంపీకి చేతనైతే చిత్తశుద్ధితో కేంద్రంతో మాట్లాడి ఫిబ్రవరి 1 చివరి బడ్జెట్లో నిధులు తీసుకురావాలని సూచించారు.
పసుపు బోర్డు ఏది?
నిజామాబాద్ ఎంపీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చేతనైతే కేంద్రంతో మాట్లాడి తెలంగాణకు నిధులు కేటాయింపులు వచ్చేలా చూడాలన్నారు. ఎనిమిదిన్నరేండ్లు అవుతున్నా రాష్ర్టానికి ఒక్క పైసా కూడా మోదీ సర్కారు ఇచ్చింది లేదు. ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వలేదు. నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ, ఐఐఎం, ఐఐఎస్సీఆర్, ట్రిపుల్ ఐటీ కొత్తగా మంజూరు కాలేదు. రాష్ట్రంలోని యువత ఆలోచన చేయాలి. పేరుకేమో సబ్కా సాత్ సబ్కా వికాస్. మాటలేమో సబ్కుచ్ బక్వాస్. ఏమీ ఉండదు. కొత్తగా ఇచ్చిందేమీ లేదు. చట్టం ప్రకారం ఇవ్వాల్సింది కూడా ఇవ్వరు. కొత్త జిల్లాకు నవోదయ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వరు.
నరేంద్ర మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సమర్థత, దక్షతను చూసి కన్నుకుట్టి ఈ రకంగా దుర్మార్ఘంగా చేస్తున్నారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. అది కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, పారిశ్రామిక కారిడార్, రాయితీలు ఒక్క హామీని నెరవేర్చని అసమర్థ బీజేపీ ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని తెలిపారు. ఫార్మా పార్కు కడతాం సాయం చేయమంటే ఉలుకు లేదు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు సాయం చేయరు. పసుపు బోర్డు అన్నరు. ఉన్న జూట్ బోర్డు ఎత్తేసిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.
తిట్టాలంటే మాకు సంస్కారం అడ్డొస్తోంది…
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధును కాపీ కొట్టి మోదీ సర్కారు పీఎం కిసాన్ తెచ్చిందన్నారు. ఈ బడ్జెట్లో దేశంలోని రైతులందరికీ ఎకరానికి రూ.5వేలు ఇవ్వాలని ఏటా రూ.10వేలు చొప్పున పంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఇచ్చేదానికి అదనంగా ఇదంతా చేయాలని కేటీఆర్ చెప్పారు. తెలంగాణకు పసుపు బోర్డు, జాతీయ ప్రాజెక్టు హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ ఎంపీకి పరోక్షంగా కేటీఆర్ చురకలంటించారు. డీఎస్పై గౌరవంతో బూతులు మాట్లాడడం లేదన్నారు. సంస్కారహీనులుగా మిగిలిపోవద్దని హితవు పలికారు.
దమ్ముంటే మాకన్నా మెరుగ్గా కేంద్రం ద్వారా పనులు చేయించాలని కోరారు. బూతులు మాట్లాడాలంటే మీ అయ్యలు, మీ తాతలను గుర్తుకు తెచ్చే మాటలు మాట్లాడగలమంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, టీఎస్డబ్ల్యూఎఫ్సీ చైర్పర్సన్ ఆకుల లలిత, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బాజిరెడ్డి జగన్, సుజిత్ సింగ్ ఠాకూర్, తారిక్ అన్సారీ, సిర్ప రాజు, పుప్పాల రవి తదితరులు పాల్గొన్నారు.
రూ.936.69కోట్లతో నగరాభివృద్ధి…
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిజామాబాద్ కార్పొరేషన్కు రూ.936.69కోట్లు కేటాయించి ఆయా అభివృద్ధి పనులను పూర్తి చేసినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. 2014 నుంచి చేపట్టిన కార్యక్రమాల వివరాలను గణాంకాలతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో నిర్వహించిన ప్రెస్మీట్లో మంత్రి వివరించారు. కేసీఆర్ హామీ మేరకు నగరపాలక సంస్థకు రూ.300 కోట్లు, టీయూఎఫ్ఐడీసీ ద్వారా 307.30కోట్లు, పట్టణ ప్రగతి కింద రూ.76.50కోట్లు, మిషన్ భగీరథ అర్బన్ ద్వారా 144.41కోట్లు, ఫైనాన్స్ కమిషన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాలను రూ.వందల కోట్లతో పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకు వెచ్చించిన నిధులే కాకుండా సెప్టెంబర్ 5న సీఎం ఇచ్చిన హామీ మేరకు రూ.100కోట్లు ప్రత్యేకంగా మంజూరయ్యాయని తెలిపారు.
నిజామాబాద్ అభివృద్ధిపై కేసీఆర్కు ఉన్న సూక్ష్మమైన అవగాహన మూలంగానే మా అందరితో రివ్యూ జరిగిందన్నారు. అందులో భాగంగా రూ.50కోట్లతో అద్భుతమైన కళాక్షేత్రానికి వేదికగా కళాభారతి నిర్మాణం జరుగనుందని తెలిపారు. సీసీ రోడ్లు, రఘునాథ పార్కు, ఫుట్పాత్లు, తిలక్గార్డెన్ అభివృద్ధి, క్రీడా మైదానం, మోడల్ మెకనైజ్డ్ దోభీఘాట్, మోడల్ సెలూన్లు, అహ్మదీబజార్ అభివృద్ధి వంటివి త్వరలోనే పూర్తవుతాయని వెల్లడించారు. పటిష్టమైన వ్యూహంతో పురపాలన అంటే పౌరుడు కేంద్రంగా ఉండాలని ఇదంతా చేస్తున్నట్లు స్పష్టం చేశారు.