ఉమ్మడి జిల్లాలో జోరుగా వ్యాక్సినేషన్
ఇప్పటివరకు 6.87లక్షల మందికి కరోనాటీకా
వచ్చింది వచ్చినట్లుగా టీకాలు వేస్తున్న వైద్య సిబ్బంది
మొదటి, రెండో విడుత డోసుల్లో సమన్వయంతో ముందుకు…
నిజామాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కరోనా వ్యాక్సినేషన్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ముందున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 77 కేంద్రాల ద్వారా కొవిడ్ టీకాల పంపిణీ జోరుగా సాగుతున్నది. ఉభయ జిల్లాల్లో జూలై 31వరకు 6లక్షల 87వేల 369 మందికి టీకా అందింది. ఇందులో ఫస్ట్ డోసు 4లక్షల 99వేల 244 మంది, సెకండ్ డోసు లక్షా 88వేల 125 మంది తీసుకున్నారు. ప్రారంభంలో అపోహల కారణంగా వ్యాక్సిన్పై కొందరు వెనుకడుగు వేయగా.. గత కొన్ని నెలలుగా పల్లె, పట్టణాల్లో అన్నివర్గాల ప్రజలు టీకాకోసం ఉత్సాహం చూపుతున్నారు. కేంద్రం నుంచి వస్తున్న టీకాల కోటా మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వాటిని అందిస్తూ వస్తున్నది. అందుబాటులో ఉన్న టీకాలను అనుసరించి రెండో డోసుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి, రెండు డోసుల మధ్య నిర్దిష్ట కాలవ్యవధిని స్థానిక వైద్యాధికారులు కచ్చితంగా పాటిస్తున్నారు. గడువు దాటకముందే రెండో డోసు సైతం ఇచ్చేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు.
కొన్ని నెలలుగా జన జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న కొవిడ్ మహమ్మారిపై యుద్ధం కొనసాగుతునే ఉన్నది. కరోనాపై టీకాస్త్రం సంధించే విషయంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు ముందున్నాయి. రోజురోజుకూ కొవిడ్ టీకాల పంపిణీలో జోరు పెరుగుతోంది. కొన్ని నెలలుగా పల్లె, పట్టణాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుబాటులోకి వస్తున్న టీకాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నది. కేంద్రం నుంచి టీకాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలో వైద్యారోగ్య శాఖ అనూహ్యమైన నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. టీకాలు అందుబాటులో ఉన్న డోసులను అనుసరించి రెండో డోసుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి, రెండు డోసుల మధ్య కాల వ్యవధిని కేంద్రం నిర్ణయించినట్లుగా నిర్ధిష్ట గడువును కచ్చితంగా పాటిస్తున్నారు. గడువు దాటకముందే రెండో డోసు సైతం ఇచ్చేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, జిల్లా దవాఖాన, ఏరియా దవాఖానల్లో ప్రత్యేక కేంద్రాల ద్వారా టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 77 టీకా కేంద్రాల్లో ఇప్పటి వరకు 6లక్షల 87వేల 369 మందికి టీకా అందింది. ఇందులో ఫస్ట్ డోసు 4లక్షల 99వేల 244 మంది, సెకండ్ డోసు లక్షా 88వేల 125 మంది తీసుకున్నారు.
భయం వద్దు..
ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుని క్లినికల్ ట్రయల్స్ అనంతరం సురక్షితమని నిర్ధారించి కొవిడ్ టీకాను విడుదల చేసింది. సాధారణ ప్రజలు మాత్రం టీకా తీసుకునేందుకు తటపటాయిస్తున్నారు. ఎలాంటి అపోహలు చెందకుండా ధైర్యంగా ముందుకొచ్చి టీకా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రామాల్లో అక్షరాస్యత తక్కువ. కొద్ది మంది అవగాహన లేక, అసత్య ప్రచారాలను నమ్మి టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మొదట్లో టీకా కోసం చాలా మంది ముందుకు రాలేదు. ప్రస్తుతం కాసింత అవగాహన తెచ్చుకుని టీకా ఇప్పించుకునేందుకు తరలివస్తున్నారు. కొవిడ్ ఉధృతి, వైరస్ సృష్టిస్తున్న నష్టంతో ప్రజల్లో అవగాహన పెరిగింది. అయినప్పటికీ గ్రామాల్లో ప్రభుత్వ యంత్రాంగం టీకాపై ప్రచారాన్ని సైతం విస్తృతం చేస్తోంది. ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న కొవిడ్ టీకా పూర్తిగా సురక్షితమని చెబుతోంది. ఎలాంటి ఇబ్బంది ఉండదని, టీకానే కొవిడ్ నివారణకు అస్త్రమంటూ పేర్కొంటుంది. ఉమ్మడి జిల్లాలో టీకా సరఫరా చేయడానికి సీడీఎస్(సెంటర్ డ్రగ్ స్టోర్)లో టీకాను స్టోరేజీ సామర్థ్యం పెంచారు. టీకాను ఇక్కడికి దిగుమతి చేసుకున్న వెంటనే అవసరాల మేరకు ఆయా పీహెచ్సీలకు సరఫరా చేస్తున్నారు.
తస్మాత్ జాగ్రత్త
చాలా మంది తొలి డోసు తీసుకున్న అనంతరం జాగ్రత్తలను మరిచిపోతున్నారని వైద్యులు గుర్తించారు. మాస్క్ ధరించడం, చేతులు శానిటైజ్ చేసుకోవడం వంటివి విస్తరించడం చాలా ప్రమాదకరం. రెండో డోసు తీసుకున్న 14 రోజుల వరకు జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తొలి డోసు టీకా తీసుకున్నాక కూడా కొందరిలో కరోనా లక్షణాలు బయ ట పడిన సంగతిని విస్మరించవద్దని హెచ్చరిస్తున్నారు. టీకా తీసుకున్నాక, మహమ్మారి అంతమయ్యే వరకూ కనీస జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఎదురు కాలే దు. తక్కువ మందిలో ఒళ్లు నొప్పులు, తలనొప్పి, జ్వ రం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు టీకా తీసుకున్న 20-30 నిమిషాల తర్వాత ఇతర పనులు చేసుకుంటున్నారు. టీకా కేంద్రాల్లో అత్యవసర చికిత్సల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. టీకా తీసుకున్న తర్వాత అనారోగ్యం తలెత్తితే వెంటనే చికిత్స చేసేలా వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచారు. పోలింగ్ బూతుల మాదిరిగా టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ధ్రువపత్రాల తనిఖీ, రిజిస్ట్రేషన్, వ్యాక్సినేషన్, అబ్జర్వేషన్ ఇలా క్రమ పద్ధతిలో ఏర్పాట్లు చేయడం ద్వారా టీకా ప్రక్రియ సజావుగా సాగుతోంది.
టీకా వివరాలివీ..
నిజామాబాద్ జిల్లాలో 3లక్షల 88వేల 449మందికి కొవిడ్ టీకా అందింది. ఇందులో 3,70, 210 మందికి కొవిషీల్డ్, 18,239 మందికి కొవాగ్జిన్ ఇచ్చారు. ఫస్ట్ డోసు 2లక్షల 83వేల 101మందికి అందగా.. సెకండ్ డోసు 1,05,348 మందికి అందించారు. 96 శాతం మంది ప్రజలు టీకా తీసుకునేందుకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకే వస్తున్నారు. ప్రైవేటు దవాఖానలను చాలా తక్కువ మంది ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్లో మొత్తం 48 టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 47 ప్రభుత్వం, ఒకటి ప్రైవేటు దవాఖానల్లో ఉన్నాయి. లక్షా 99వేల 583 మంది పురుషులు, లక్షా 88వేల 816మంది స్త్రీలకు టీకా ఇచ్చారు. 60ఏండ్లు పైబడిన 87వేల 9251 మంది, 45 నుంచి 60 ఏండ్ల వయస్సు వారు లక్షా 61వేల 830 మంది, 18 నుంచి 44 ఏండ్ల వయస్సున్న వారు లక్షా 38వేల 694 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 2లక్షల 98వేల 920 మందికి వ్యాక్సిన్ అందించారు. ఇందులో ఫస్ట్ డోసు 2లక్షల 16వేల 143 మంది, సెకండ్ డోసు 82,777 మందికి ఇచ్చారు. కొవిషీల్డ్ టీకాను 2లక్షల 79వేల 436 మంది తీసుకున్నారు. కొవాగ్జిన్ టీకాను 19వేల 484 మందికి ఇచ్చారు. ఇందులో లక్షా 44వేల 212మంది పురుషులు, లక్షా 54వేల 655 మంది స్త్రీలు ఉన్నారు. ఇందులో 60 ఏండ్లు పైబడిన వారు 86వేల 996 మంది, 45 నుంచి 60 ఏండ్ల వయస్సు వారు లక్షా 36వేల 605 మంది, 18నుంచి 44 మధ్య వయస్సు వారు 75వేల 319 మంది ఉన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 29 టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రైవేటు దవాఖానలకు అనుమతులు ఇవ్వలేదు.