కంఠేశ్వర్, జూన్ 18: పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఐఆర్ సర్వేను పురస్కరించుకుని నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో గురువారం గ్రామీణ నియోజకవర్గ బూత్ లెవల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. సర్వే ఎలా చేయాలి, ఏయే అంశాలను పరిశీలించాలి, ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పాటించాల్సిన పద్ధతులను మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 25 నుంచి జూలై 24వ తేదీ వరకు బీఎల్వోలు ప్రతి ఇంటినీ సందర్శిస్తూ ఓటరు మ్యాపింగ్ను పూర్తి చేయాలని సూచించారు. ఎస్ఐఆర్లో పాల్గొంటున్న బీఎల్వోలకు సర్వే కాలంలో నెల రోజుల పాటు వారి శాఖలకు సంబంధించిన దైనందిన విధుల నుంచి మినహాయింపు కల్పించారని తెలిపారు. ప్రతి ఓటరుకు రెండు చొప్పున ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని, వాటిని ఓటరు సరైన విధంగా పూరించారా అన్నది పరిశీలించాన్నారు. పూరించిన ఒక పారాన్ని తీసుకుని మరో ఫారాన్ని ఎక్నాలెడ్జ్ రూపంలో అందించాల్సి ఉంటుందన్నారు. ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు బాలరాజు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.