నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 8: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో వేల్పూర్ మండలం దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిందని మాజీ జిల్లా కలెక్టర్, ప్రస్తుత జలశక్తి మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అశోక్ కుమార్ అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, అధికారుల అంకితభావం, ప్రజాప్రతినిధుల సహకారంతోనే 2001లో వేల్పూర్ను దేశంలోనే మొదటిసారిగా బాల కార్మికులులేని మండలంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. జిల్లా కేంద్రంలోని ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఆజాదీకా అమృత్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించిన మండలంగా వేల్పూర్కు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మండలంలో 539 మంది బాలకార్మికులను పాఠశాలలో చేర్పించామని తెలిపారు. సీఎం కేసీఆర్ విద్యారంగంపై అత్యంత శ్రద్ధ చూపుతున్నారని, ఒకే రోజు రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించారని అన్నారు. అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే, ప్రస్తుత నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆన్లైన్ ద్వారా మాట్లాడుతూ..ఒక మంచి పనిని ప్రతిఒక్కరూ గర్వించేలా చేశారని అభినందించారు. కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అశోక్కుమార్ చేసిన సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. అనంతరం వీవీగిరి నేషనల్ లేబర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎం.శ్రీనివాస్, లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్మికశాఖ స్పెషల్ సీఎస్ రాణి కుముదిని ఆన్లైన్ ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ మకరంద్ పాల్గొన్నారు.