వేల్పూర్, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని ప్రతి గడపకూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. క్రిస్టియన్, మైనార్టీ అభ్యున్నతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని పేర్కొన్నారు. మండలంలోని లక్కోరా గ్రామంలో ఉన్న ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో బాల్కొండ నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీ చర్చిల అభివృద్ధి కోసం మంజూరైన నిధుల ప్రొసీడింగ్ కాపీలను ఆయా చర్చి కమిటీల సభ్యులకు మంత్రి గురువారం అందజేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని సుమారు 40 చర్చిలకు రూ. 2.75 కోట్ల నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి వేముల మాట్లాడుతూ.. కుల మతాలకు అతీతంగా ప్రజల ముఖాల్లో ఆనందం చూడాలనేది కేసీఆర్ ధ్యేయమని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్లు తనపై చూపే ప్రేమ మరవలేనిదన్నారు. గతంలో చర్చిల అభివృద్ధి కోసం రూ. 1.50 కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు మళ్లీ సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ. 2.75 కోట్లతో చర్చిల అభివృద్ధి కోసంనిధులు మంజూరు చేసినట్లు చెప్పారు.
క్రైస్తవ మతం విశ్వాసానికి, త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని పేర్కొన్నారు. ఏ మతం కూడా ఒకరిని ఇబ్బంది పెట్టాలని చూడదని, ఇతరుల మంచి కోరుకుని వీలైతే సహాయం చేయాలని చెబుతుందన్నారు. అందుకే అందరినీ గౌరవిస్తూ సమానంగా నియోజకవర్గంలోని గుడులు, మసీదులు, చర్చిలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన క్రిస్టియన్లకు మంత్రి వేముల ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలాల నుంచి సుమారు రెం డు వేల మంది క్రిస్టియన్లు హాజరయ్యారు.
రానున్న ఎన్నికల్లో వేముల విజయం ఖాయమని విజయం కోసం ముక్తకంఠంతో అందరూ ప్రార్థించి ఆశీస్సులు అందించారు. తన తల్లి ఆరోగ్యం మెరుగుపడాలని అక్కడికి వచ్చిన వారందరూ ప్రార్థించడంతో వారు చూపిన అభిమానానికి మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్రావు, తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ మధుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.