వర్ని, మార్చి 26: మండలంలోని సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సిద్ధాపూర్ రిజర్వాయర్ వద్ద బండ్ నిర్మాణ పనులను ప్రారంభించారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ..రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తోందని తెలిపారు. రూ. 120 కోట్లతో సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను చేపట్టినట్లు చెప్పారు. రైతుల కోసం నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ను జూన్, జూలై మాసాల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హరిదాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ వెలగపూడి గోపాల్, బీఆర్ఎస్ నాయకులు మేక వీర్రాజు, కల్లాలి గిరి, ఇరిగేషన్ డీఈఈ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.