శక్కర్నగర్, జనవరి 3: మహిళతో సన్నిహితంగా ఉండడమే కాకుండా ఈ విషయంలో ఎన్నిమార్లు చెప్పినా వినకపోవడంతో పట్టణంలోని శక్కర్నగర్ శాంతినగర్ కాలనీకి చెందిన చాట్ల శివ అలియాస్ శాపురంను పథకం ప్రకారం మహిళ భర్త, అతని తల్లి, బావలు కలిసి హత్య చేసినట్లు బోధన్ ఏసీపీ కేఎం కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 2న న ర్సాపూర్ శివారులో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందగా శాంతినగర్కు చెందిన చాట్ల శివగా గుర్తించారు. పట్టణ సీఐ బీడీ ప్రేమ్కుమార్, ఎస్సై నవీన్, బాబూరావు బృందం చేపట్టిన విచారణలో భాగంగా సంఘటనా స్థలానికి కారు వచ్చినట్లు గుర్తించారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. రాజే రంజిత్ భార్య సోనీతో శివ సన్నిహితంగా ఉండేవాడని, ఇందులో భాగంగానే పలుమార్లు వారించగా.. గొడవలు సైతం జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. శివ ఈ నెల ఒకటో తేదీన అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి రాగా.. కాపుకాసిన రంజిత్ ఒక్కసారిగా గొడ్డలితో వెనుక నుంచి దాడి చేశాడు. శివ కింద పడిపోగానే తన బావలు పసికంటి అరుణ్, నూనె శివ కుమా ర్, దండి సునీల్, తల్లి రుక్మిణి అలియాస్ రాణితో కలిసి తీవ్ర గాయాలైన శివను కారులో నర్సాపూర్ శివారులోకి తీసుకెళ్లి అక్కడ మరోమారు దాడి చేశా రు. శివ మృతి చెందినట్లు నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తుండగా మంగళవారం మధ్యాహ్నం శక్కర్నగర్ చౌరస్తా వద్ద రంజిత్ను పట్టుకుని మిగతా వారికోసం విచారించగా కారులో పరారయ్యేందుకు సిద్ధంగా ఉన్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నేరం ఒప్పుకోవడంతో వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు. సంఘటనలో వినియోగించిన గొడ్డలి, కారు, బైక్ను సీజ్ చేసినట్లు ఆయన వివరించారు. ఒక్క రోజులోనే కేసు ఛేదించిన పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్, ఎస్సై నవీన్, బాబూరావు, ఏఎస్సై గంగాప్రసాద్, కానిస్టేబుళ్ల్లు యాదగిరి, నరేందర్, జాకీర్, కైసర్లకు రివార్డులు అందజేసి అభినందించారు.