కామారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశంలోనే కాదు, విదేశీ పర్యటనల్లో ఉన్న భారతీయులకు తిప్పలు తప్పడంలేదు. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఈ నెల 19న ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో వివిధ దేశాల్లో పర్యటిస్తున్న భారతీయులు, హజ్, ఉమ్రాకు వెళ్లిన భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. విదేశాల్లో వాటిని మార్చుకొనేందుకు మనీ ఎక్సేంజీల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లోని మనీ ఎక్సేంజీల నిర్వాహకులు 2 వేల నోట్లు తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు. భారతీయుల నుంచి ఆ నోట్లు తీసుకుంటే వాటిని మార్చుకోవడం ఇబ్బందిగా ఉంటుందని వారు నిరాకరిస్తున్నారు. 2 వేల నోట్లను ఇండియాలోనే మార్చుకోవాలని, 500 నోట్లు ఉంటేనే ఇవ్వాలని చెబుతున్నారు. ఆర్బీఐ రూ.2వేల నోట్లను ఉపసంహరించిన తేదీ కన్న ముందే ఆయా మనీ ఎక్సేంజీల్లో కరెన్సీ కుప్పలుకుప్పలుగా ఉన్నాయని, వాటిని మార్చడమే ఇబ్బందిగా ఉంటే, కొత్తగా తీసుకొని మళ్లీ చిక్కుల్లో పడడం దేనికని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా మే 19 కన్నా ముందే గల్ఫ్ తదితర దేశాలకు వెళ్లిన భారతీయులు ఖర్చుల కోసం తీసుకెళ్లిన రూ.2 వేల నోట్లను ఎలా మార్చుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా గత నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రం నుంచి సౌదీ అరేబియాలోని మక్కా, మదీనాకు ఉమ్రా చేయడానికి వేలాది మంది వెళ్లారు. వారి వద్ద ఉన్న రూ.2 వేల నోట్లు అక్కడ చెల్లకపోవడంతో డబ్బులు లేక తీవ్ర అవస్థల పాలవుతున్నారు. డబ్బు ఉన్నా అక్కడ చెల్లుబాటు కాకపోవడడంతో తిప్పలు పడుతున్నారు.
2 వేల నోట్లు తీసుకోబోమని బోర్డులు..
రెండు వేల నోట్లు తీసుకోబోమని రాష్ట్రంలో చాలా చోట్ల బోర్డులు వెలిశాయి. పలు వ్యాపార వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు దవాఖానల్లో ఇప్పటికే రూ.2 వేల నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. వాస్తవానికి ఆర్బీఐ 2 వేల నోట్లను రద్దు చేయలేదు. వాటి చెలామణిపై నియంత్రణ విధించలేదు. సెప్టెంబర్ 30 లోపు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని, రోజువారీగా రూ.20 వేల వరకు రెండు వేల నోట్లను మార్చుకోవచ్చని స్పష్టం చేసింది. అయినా కొందరు వ్యాపారులు 2 వేల నోట్లను ఇప్పటి నుంచే తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు.
చాలా ఇబ్బంది పడ్డాం..
ఈ నెల 10న సౌదీ అరేబియాలోని మక్కాకు ఉమ్రా కోస వెళ్లిన. సులువుగా ఉంటుందని 2 వేల నోట్లను తీసుకెళ్లిన. అక్కడ కొన్ని డబ్బులను రియాల్స్లో మార్చుకున్న. ఇంకా కొన్ని నోట్లు ఉన్నాయి. ఉమ్రా పూర్తి చేసేలోపు రూ.2వేల నోట్లు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటన వెలువడింది. సౌదీలో నోట్లను మార్చుకుందామంటే ఎవరూ తీసుకోలేదు. అట్లనే ఇండియాకు తీసుకొచ్చ. అక్కడ మనీ ఎక్సేంజ్ కాకపోవుడుతోని డబ్బులకు మస్తు ఇబ్బంది అయింది.
– డాక్టర్ హాజీ, ఉమ్రా యాత్రికుడు, బాన్సువాడ