మెండోరా, జూలై 18: ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జలాశయాలకు వరద పోటెత్తుతున్నది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు నీటి తో కళకళ లాడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్పంగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్లోకి 2,466 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 50 క్యూసెక్కులు, గుత్ప అలీసాగర్ ఎత్తి పోతల పథకాలకు 630 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రా జెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీంఎసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1086.20 అడుగుల (70.670 టీఎంసీలు) వ ద్ద ఉన్నదని తెలిపారు. ఎస్సారెస్పీలోకి 55 టీఎంసీల వరద వచ్చి చేరిందని ఏఈఈ తెలిపారు.
కౌలాస్నాలా, నిజాంసాగర్,పోచారం ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉన్నదని డీఈఈ దత్తాద్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458.00 మీటర్లు (1.23 టీఎంసీలు) ఉండగా, ఆదివారం సాయంత్రానికి 457.60 మీటర్ల (1.15 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి 303 క్యూసెక్కుల ఇన్ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్నదని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రానికి 768 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405. 00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 396.33 అడుగుల( 7.87 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈ పేర్కొన్నారు.
పోచారంలోకి 426 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మండలంలోని పోచారం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టులోకి 426 క్యూసెక్కులు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 13.8 అడుగుల నీరు ఉన్నట్లు డీఈఈ తెలిపారు.