నిజామాబాద్, డిసెంబర్ 17, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏడేండ్లలో అమలు చేయని పథకం అంటూ లేదు. అన్ని వర్గాల ప్రజల సాధారణ సమస్యలను తీరుస్తూనే ఆయావర్గాలకు ప్రోత్సాహకాలు అందించారు. పూర్తి రాయితీతో అనేక పథకాలు తీసుకువచ్చారు. ఇప్పుడు అమలవుతున్న పథకాలకు తోడు సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రో గ్రాం పేరిట తీసుకువచ్చిన దళితబంధు పథకం సంబంధిత వర్గాల అభ్యున్నతికి బాటలు వేయనున్నది. దళిత ప్రజలను పట్టి పీడిస్తున్న పేదరికాన్ని కూకటి వేళ్లతో తొలగించడం కోసం ఈ పథకం రూపొందించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి ప్రభు త్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు ప్రభుత్వం ఎంతో లబ్ధి చేకూర్చింది. ఇప్పుడు ఈ నూతన పథకం మరింతగా దళితుల మేలు కోసం పాటుపడనున్నది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంపిక చేసిన వంద దళిత కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలనే ఆలోచనపై దళిత మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే నిధులు మరింత పెంచుతామని కేసీఆర్ ప్రకటించడంతో పాటు దళితబంధు పథకం అనేది సబ్ప్లాన్ నిధులకు అదనపు కేటాయింపులని చెప్పడంతో ఆ వర్గాల్లో నమ్మకాన్ని నిలబెడుతున్నది. నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రాధాన్యత ఏర్పడింది. మార్చిలోపు ప్రతి నియోజకవర్గంలో వంద మంది దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు తీరుతెన్నులపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
మార్చి నాటికి అంతటా…
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న దళితబంధు పథకం వచ్చే మార్చి నెలాఖరులోగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చేరనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తొలి దశలో 100 మందికి ఈ పథకం ప్రయోజనాలు అందించేందుకు సర్కారు సిద్ధం అవుతున్నది. అంతకు ముందే నలుదిక్కులా దళితబంధు పథకం గొప్పతనాన్ని ఆయా ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు, దళిత ప్రజలకు తెలిసే విధంగా పైలట్ పథకం సైతం అమలు కాబోతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే జుక్కల్ నియోజకవర్గం నుంచి నిజాంసాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. సీఎం ఆదేశాలతో నిజాంసాగర్ మండలంలో క్షేత్ర స్థాయిలో దళిత కుటుంబాల జీవన స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులపై సర్వేలు పూర్తయ్యాయి. పూర్తి నివేదిక సైతం ప్రభుత్వానికి చేరింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్న అర్హులైన మొత్తం దళిత కుటుంబాలకు త్వరలోనే దళిత బంధు పథకం అమలు కానున్నది.
నిజాంసాగర్లో అర్హుల గుర్తింపు పూర్తి…
దేశంలో ఎక్కడా లేని విధంగా అమలవుతున్న దళితబంధు పథ కం ప్రాథమిక దశలో రాష్ట్ర వ్యాప్తంగా నలుదిక్కులా అమలవుతున్నది. హుజూరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన పథకానికి ఇప్పుడు పశ్చిమ దిశలో కామారెడ్డి జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు స్థానమైన జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. దాదాపు 5వేల మంది దళిత ప్రజలు నివసిస్తున్న ఈ మండలంలో కొన్ని రోజులుగా ప్రభుత్వ యం త్రాంగం పథకం అమలుపై నివేదికలు సిద్ధం చేసింది. షెడ్యూల్డ్ కులాలకు చెందిన కుటుంబాల స్థితిగతులపై మొదట సర్వే నిర్వహించారు. వారి ఆర్థిక పరిస్థితిపై అంచనాలు రూపొందించారు. భౌగోళిక, ఆర్థిక, సామాజిక, అక్షరాస్యత, పేదరికం వంటి అంశాలతో కుటుంబాల వారీగా వివరాలు క్రోడీకరించా రు. ఏ గ్రామంలో ఎంత మంది జనాభా, కుటుంబాలున్నాయో వివరాలను సిద్ధం చేశారు. వారి జీవన ప్రమాణాలపై అధ్యయనం చేశారు. ప్రస్తుతం వారికి నెలవారీగా వస్తున్న ఆదాయ వివరాలు, వారిప్పుడు ఎలాంటి వృత్తి పనులు చేస్తున్నారు? వంటి అంశాలపై సం పూర్ణ పరిశీలనను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేపట్టారు.
అట్టడుగు వర్గాలకు ఆశాదీపం…
సామాజిక వివక్ష, అణచివేతకు గురవుతున్న దళిత ప్రజలకు సీఎం కేసీఆర్ ఆశాదీపం అవుతున్నారు. ఆకలిని, అవమానాలను అనుభవిస్తూ అణిచివేతకు, అభద్రతకు గురవుతున్న దళితుల్లో సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలోని దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి వారి స్వావలంబన కోసం రూ.వేల కోట్లతో ప్రకటించిన దళితబంధు పథకం రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నవ శకానికి నాంది పలుకనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందుతుంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో దాదాపు మూడున్నర లక్షల మంది దళిత సమాజం జీవనం సాగిస్తున్నది. నిజామాబాద్ జిల్లా మొత్తం జనాభా 15లక్షల 77వేలు. ఇందులో పురుషులు 7.71లక్షలు కాగా, స్త్రీలు 8.05లక్షలు మంది ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 2.17లక్షలు. ఇందు లో పురుషులు 1.04లక్షలు, స్త్రీలు 1.12లక్షలు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాల శాతం13.78 శాతంగా ఉన్నది. కామారెడ్డి జిల్లా మొత్తం జనాభా 9.72లక్షలు. పురుషులు 4.78 లక్షలు కాగా స్త్రీలు 4.94లక్షలుగా ఉన్నారు. షెడ్యూల్డ్ కులాల జనాభా 1.53 లక్షలు. ఇందులో పురుషులు 74,133, స్త్రీలు 79,169 మంది ఉన్నారు. మొత్తం జిల్లా జనాభాలో షెడ్యూల్డ్ కులాల శాతం 15.76 శాతంగా ఉంది.
ధాన్యంపైనా సమీక్ష…
పంటల ఉత్పత్తుల సేకరణపై కేంద్ర ప్రభుత్వం రోజుకో రీతిలో కిరికిరి పెడుతున్న సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ముందుండి రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నది. వేల కోట్లు వెచ్చించి అన్నదాతలకు మద్దతు ధరను అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మాత్రం చాకచక్యంగా కొనుగోళ్ల బాధ్యతల నుంచి తప్పించుకుని రైతు పేరి ట రాజకీయం చేస్తోంది. రైతును ఆదుకోవాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దాదాపు పూర్తయ్యింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 458 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. దాదాపు రూ.1300 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని సేకరించారు. కామారెడ్డి జిల్లాలోనూ 344 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుండగా 80శాతం ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలిన చోట్ల ఇంకా కొనుగోళ్లు చేస్తున్నారు. శనివారం ప్రగతి భవన్లో జరిగే కలెక్టర్ల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, ఇతర పంటల సాగు విధానాలపైనా సమీక్ష ఉండబోతున్నది. ఇందుకోసం వ్యవసాయాధికారులను సైతం మీటింగ్కు ఆహ్వానించారు.