ఖలీల్వాడి/భీమ్గల్/సిరికొండ/శక్కర్నగర్/మోర్తాడ్/నవీపేట, జూలై 11: జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. పల్లెల్లో వరినాట్లు ముమ్మరంగా కొనసాగుతుండడంతో భారీ వర్షానికి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో జోరు వర్షం కురిసింది . మధ్యాహ్నం నుంచి సుమారు మూడు గంటల పాలు కుండపోత వాన కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని ఆటోనగర్, గాంధీచౌక్ ప్రాంతాల్లో వాహనదాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే కమాన్ వద్ద వర్షపునీరు నిలువడంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కంఠేశ్వర్కు వెళ్లే మార్గంలో చెరువును తలపించేలా నీరు నిలిచిపోయింది. తేనె సాయిబాబా ఆలయం నుంచి పక్కనే ఉన్న తహసీల్ కార్యాలయంలోకి వరదనీరు వచ్చింది. బోధన్ పట్టణంతోపాటు, ఎడపల్లి మండలంలో రోడ్లపై వరద నీరు ప్రవహించగా, లోతట్టు ప్రాంతాలు వాననీటితో నిండిపోయాయి.
ఎడపల్లి మండల పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతుండగా, భారీ వర్షాలతో రోడ్లు కోతకు గురవుతున్నాయి. బోధన్ డివిజన్ పరిధిలో వర్షపాతం ఇవరాలు ఇలా ఉన్నాయి. రెంజల్ మండలంలో 5.8 మిల్లీ మీటర్లు, ఎడపల్లి మండలంలో 2.4 మి.మీ., బోధన్ మండలంలో 1.8 మి.మీ, కోటగిరి మండలంలో 1.4 మి.మీ, మోస్రాలో 2.5 మి.మీ., రుద్రూర్ మండలంలో ఒక మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందనివాతావరణశాఖ అధికారులు తెలిపారు. సిరికొండ మండలంలో కురిసిన వర్షానికి చీమన్పల్లి, న్యావనంది, రావుట్ల, సిరికొండ, తూంపల్లి గ్రామాల్లో వాగులు, కుంటలు నిండాయి. మండలంలో 47మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలో బస్టాండ్తోపాటు గ్రామంలోని లోతట్టు ప్రాంతంలో ఇండ్లల్లోకి నీరు చేరాయి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇబ్బందిగా ఉందని, ఇండ్లల్లోకి వర్షం నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
నవీపేట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సీజన్లో ఇదే భారీవర్షం కావడంతో చెరువుల్లోని నీరు చేరింది. వాగులు, వంకలు నిండుగా ప్రవహిస్తున్నాయి. చెక్డ్యాములు పొంగి పొర్లడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
పొంగిపొర్లుతున్న వేముగంటి ప్రాజెక్టు
ఇటీవల కురిసిన వర్షాలకు భీమ్గల్ మండలంలోని పల్లికొండ వేముగంటి ప్రాజెక్టు ఇప్పటికే నిండు కుండలా మారింది. ఎగువన జోరుగా వానలు పడుతుండడంతో భారీ గా వరద చేరి ప్రాజెక్టు శనివారం రాత్రి నుంచి పొంగి పొర్లుతున్నది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.