ఎల్లారెడ్డి, ఆగస్టు 10: పుట్టింది గిరిజన తండా…పెరిగింది ప్రభుత్వ వసతి గృహాలు…కలిసింది క్రీడా మైదానం…చేరుకుంది అంతర్జాతీయ పోటీలకు…వీరంతా లింగంపేట మండలంలోని ఎక్కపల్లితండా ఏకలవ్యులు. చదువుకుంటున్న పాఠశాలలోని సీనియర్ విద్యార్థుల స్పూర్తి, పీఈటీల ప్రోత్సాహం, గ్రామీణ నేపథ్యమైనా అకుంఠిత దీక్ష వారిని రాష్ట్రస్థాయి నుంచి జాతీయ స్థాయికి అక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. నేపాల్ దేశ రాజధాని కాఠ్మండులో ఈనెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్న ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ చాంపియన్షిప్-2021కు తెలంగాణ తరఫున ఎంపికయ్యారు.
ముగ్గురిదీ ఒకే గ్రామం
నేపాల్లో జరిగే అంతర్జాతీయ వాలీబాల్ పోటీలకు ఎంపికైన ముగ్గురు క్రీడాకారులదీ ఒకే గ్రామం కావడం విశేషం. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఎక్కపల్లి తండాకు చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ పాఠశాలల్లో చదువుకున్నారు. తండాకు చెందిన నేనావత్ నవీన్ ప్రస్తుతం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. 6 నుంచి 9వ తరగతి వరకు గాంధారి ఉన్నత పాఠశాలలో చదువుతూ వసతి గృహంలో ఉన్నాడు. అక్కడ పీఈటీ సాయిలు ప్రోత్సాహంతో వాలీబాల్ నేర్చుకున్నాడు. అటు తర్వాత బొల్లారం గ్రామంలో పదో తరగతి అభ్యసిస్తూ పీఈటీ నరేశ్ సహకారంతో వాలీబాల్లో మెళకువలు నేర్చుకున్నాడు. ఎల్లారెడ్డిలో ఇంటర్ చదువుకునేటప్పుడు ఆంగ్ల అధ్యాపకుడు రాములు ప్రోత్సహించారు. మరో విద్యార్థి సబావత్ సుభాష్ తండాకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బొల్లారం ఉన్నత పాఠశాలలో నరేశ్ సార్ సహకారంతో వాలీబాల్లో రాణించడం ప్రారంభించాడు. ఎల్లారెడ్డిలో ఇంటర్ చదువుతూ వాలీబాల్ ఆటను కొనసాగించాడు. గత సంవత్సరం వరంగల్లో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబర్చడంతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సంవత్సరం మార్చిలో జమ్మూకశ్మీర్, జూలైలో గుజరాత్లోని నిజాంనగర్లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చడంతో అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాడు. మరో విద్యార్థి సబావత్ వినోద్ ఎల్లారెడ్డిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నాడు. అప్పటి పీఈటీ వెంకట్ ప్రోత్సాహంతో వాలీబాల్ ఆటపై మక్కువ పెరిగింది. ఇంటర్ సైతం ఎల్లారెడ్డిలోనే చదివిన వినోద్ ప్రస్తుతం కామారెడ్డి సమీపంలోని గిరిజన డిగ్రీ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్నాడు.
సీనియర్ల సహకారంతో ఆటపై పెరిగిన ఇష్టం
ఎల్లారెడ్డిలో ఇంటర్ చదువుకునే రోజుల్లో సీనియర్ విద్యార్థుల ప్రోత్సాహం, స్ఫూర్తి తమను వాలీబాల్ వైపు మళ్లించిందని చెబుతున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోపాటు నిత్యం తమకు ఇద్దరు సీనియర్లు సహకరించారని చెప్పారు. ఎల్లారెడ్డి మండలంలోని హజీపూర్ గ్రామానికి చెందిన గోపీ ప్రస్తుతం జాతీయస్థాయిలో కబడ్డీ ఆడుతున్నాడని, మరో సీనియర్ రామక్కపల్లికి చెందిన నవీన్ చాలా సహకరించారని విద్యార్థులు పేర్కొన్నారు.
శిక్షణకు 40కిలోమీటర్ల ప్రయాణం…
ఇప్పటి వరకు పాఠశాల, ఇంటి వద్ద మాత్రమే ప్రాక్టీస్ చేసిన ఈ ముగ్గురు విద్యార్థులు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆడేందుకు మాత్రం కామారెడ్డి సమీపంలోని దేవునిపల్లిలో ఉన్న విన్నింగ్ లైఫ్ క్రీడల అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. నేపాల్లో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటున్నందున మరింత నైపుణ్యంగా ఆడేందుకు వీరు రోజూ ఎక్కపల్లి తండా నుంచి 40కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ శిక్షణ పొందుతున్నారు.
ఆర్థిక సహాయం కోసం వేడుకోలు..
ఇష్టంతో ఆడుతున్న వాలీబాల్ ఆటపై పట్టు ఉందని, కానీ నేపాల్ వెళ్లడం ఖర్చుతో కూడుకున్న విషయమైనందున దాతలు సహకరించాలని కోరుతున్నారు. పూర్తిగా వ్యవసాయ కుటుంబాలే అయినందున వేల రూపాయల ఖర్చును భరించలేమని, కనీసం ఒక్కొక్కరికీ 30వేలకు పైగా ఖర్చవుతుందని పేర్కొంటున్నారు. వారం రోజుల ప్రయాణం, నేపాల్ రాజధానిలో మకాం తదితర వాటికి వేల రూపాయలు అవసరం ఉంటుందని, ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు.