నిజామాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి):పసుపు బోర్డు ఏర్పాటు అనేది ఇందూరు పసుపు రైతుల చిరకాల వాంఛ. రెండున్నర దశాబ్దాలుగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు కోసం రైతులు ఉద్యమిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు ఏండ్లుగా మాయమాటలతో రైతులను ముంచుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల సమయంలో నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పసుపు బోర్డు తథ్యమని ప్రకటనలు గుప్పించారు. ధర్మపురి అర్వింద్ తన ఎన్నికల ప్రచారంలో ఒకడుగు ముందుకేసి తాను గెలిస్తే ఏకంగా ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. అంతేకాకుండా రూ.100 విలువ చేసే బాండ్ పేపర్పై సంతకం చేసి రైతులను నమ్మించాడు. బోర్డు తేలేకపోతే రాజీనామా చేస్తానంటూ ప్రకటించిన ధర్మపురి అర్వింద్ తన మాట నిలబెట్టుకోవాలంటూ నందిపేట మండలంలోని తల్వేద గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ హోదాలో ప్రజల్లోకి వచ్చినప్పుడల్లా రైతులు, యువకులు, మహిళలు అడుగడుగునా అర్వింద్ను నిలదీస్తున్నారు. పసుపు బోర్డు ఏదంటూ ప్రశ్నిస్తున్నారు. రైతుల్లో చల్లారని ఆగ్రహావేశాల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ధర్మపురి అర్వింద్కు తల్వేద రైతన్నలు నిరాహార దీక్షతో నిరసన వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా మొదలైన తల్వేద దీక్ష అనేక మంది పసుపు రైతులను ఆలోచింపజేస్తున్నది.
అర్వింద్ను వదలని రైతులు..
పసుపు రైతుల భావోద్వేగాన్ని ఎంపీ అర్వింద్ తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అడుగడుగునా ప్రయత్నిస్తున్నాడు. మొదట్నుంచి తానిచ్చిన హామీలను నెరవేర్చలేక విలవిల్లాడుతోన్న ఎంపీ… ఎలాగైనా పసుపు బోర్డు అంశాన్ని పక్కదారి పట్టించాలనే కుట్రకు దిగుతున్నారు. బీజేపీ శ్రేణులను ఇందుకోసం బలంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వ్యాప్తి చేయిస్తున్నారు. 827 రోజులుగా పసుపు బోర్డు అంశంపై లోక్సభలో ఏ ఒక్క రోజూ నోరెత్తి మాట్లాడని అర్వింద్… క్షేత్రస్థాయిలో రైతులను మోసగించేందుకు అనేకనేక ప్రకటనలు చేసి రైతులను పక్కదారి పట్టిస్తున్నాడు. దేశంలో పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వమే అయినప్పటికీ నిత్యం గందరగోళ ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నాలకు ఎంపీ అర్వింద్ ప్రయత్నిస్తున్నాడు. ధర్మపురి అర్వింద్ తీరును నిశితంగా పరిశీలిస్తున్న నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన పసుపు రైతులు ఆయన ఎత్తుగడలను నిస్తేజం చేస్తున్నారు. రైతులను ప్రతీ అంశంలో పావుగా వాడుకునేందుకు ఎంపీ తంటాలు పడుతుంటే, పసుపు రైతులు మాత్రం అర్వింద్ కుట్రలను భగ్నం చేస్తూ ఆయన నిజ స్వరూపాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
రైతుల పేరుతోనే బీజేపీ డ్రామాలు
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం భిన్న సారూప్యంతో కూడుకున్నది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతులే ప్రధాన భాగంగా ఉన్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అనేక రైతు ప్రయోజన పథకాలను అమలు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న ఎర్రజొన్నల అంశాన్ని పరిష్కరించి రూ.కోట్ల బకాయిలను చెల్లించారు. సాగునీటి ఇక్కట్లు లేకుండా చూశారు. రైతులంతా టీఆర్ఎస్ సర్కారు వైపే మద్దతు తెలుపుతుండడంతో భారతీయ జనతా పార్టీ ఎన్నికల సంగ్రామంలో కుట్రలకు తెర లేపింది. అబద్దాలు ప్రచారం చేసింది. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పటికీ పసుపు బోర్డును మోదీ సర్కారు మంజూరు చేయలేకపోయింది. అలాంటిది రైతులను మభ్య పెట్టేందుకు బీజేపీ అభ్యర్థిగా అర్వింద్ పసుపు బోర్డు తీసుకు వస్తానంటూ ఎన్నికల్లో ప్రకటన చేశారు. తనను గెలిపిస్తే ఐదు రోజుల్లోనే బోర్డు ఏర్పాటు చేయిస్తానని చెప్పి రైతులకు ప్రస్తుతం మొండి చేయి చూపిస్తున్నాడు. పసుపు పంటకు కనీస మద్దతు ధర, పసుపు బోర్డు ఏర్పాటుపై కనీసం కదలిక లేకపోవడంతో ఎంపీపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తల్వేదలో నిరసనోద్యమం..
నిజామాబాద్ జిల్లాలో పసుపు సాగు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు ముందుంటాయి. నందిపేట, ఆర్మూర్, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, వేల్పూర్ మండలాల్లో పసుపు సాగు చేసే కర్షకులు ఊరూరా కనిపిస్తారు. లక్షల ఎకరాల్లో అనాదిగా పసు పు పంటను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి అవసరాన్ని గుర్తించిన భారతీయ జనతా పార్టీ సాధారణ ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించి మోసగించింది. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ధర్మపురి అర్వింద్ అడుగడుగునా ఇదే విషయాన్ని రైతులకు చెప్పి తనకు ఓట్లు వేయించుకున్నాడు. రెండేండ్లు దాటినప్పటికీ పసుపు బోర్డు ఏర్పాటుపై అతీగతీ లేదు. పైగా ఓట్ల కోసం గ్రామాల్లో తిరిగిన బీజేపీ ఇప్పుడు రైతులకు భయపడి ముఖం చాటేస్తుంది. ఎంపీగా గెలిచిన తర్వాత అర్వింద్ సైతం కర్షకుల కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. పసుపు బోర్డు హామీపై అడుగడుగునా బీజేపీని నిలదీస్తున్న రైతులు.. ఇప్పుడేకంగా నిరాహార దీక్షలకు దిగారు. నందిపేట మండలం తల్వేద గ్రామంలో పసుపు రైతులంతా పచ్చ కండువాలు వేసుకొని ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్నారు. పసుపు బోర్డు హామీని రైతులు మరిచిపోలేదనే సందేశాన్ని లోక్సభ సభ్యుడు ధర్మపురి అర్వింద్కు చేరవేసేందుకు కర్షకులు నిరసనోద్యమానికి శ్రీకారం చుట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది.