బీర్కూర్, సెప్టెంబర్ 26:పేద, బడుగు, బలహీన వర్గాలకు తెలంగాణలో అందిస్తున్న ఆసరా పింఛన్ దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్నది. వృద్ధాప్యంలో చేతిలో కర్రలా ఆసరానందించడం కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నది. బీడీ, గీత కార్మికులకు చేయూతనందించే భుజం కోసం వేచి చూస్తున్నది. ఎన్నో అద్భుతమైన పథకాలు తెలంగాణలో అమలవుతుండగా… దేశవ్యాప్తంగా అమలు చేయడం పెద్ద కష్టమేమీ కాదని పింఛన్ లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు, ఇంటింటికీ తాగునీరు, ఎవుసానికి సాగునీరు, ఆసరా లాంటి పథకాలన్నీ యావ త్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయి. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలన్నీ దేశంలో అమలైతే మరింత ప్రగతి సాధిస్తుంది. ఇది కేసీఆర్తోనే సాధ్యమని, అందుకే ఆయన రాక కోసం దేశ ప్రజానీకం ఎదురుచూస్తున్నదని చెబుతున్నారు. తెలంగాణలో రూ.2016, రూ.3016 పింఛన్ ఇస్తుండగా, మిగతా రాష్ర్టాల్లో రూ.400 నుంచి రూ.1400 మాత్రమే అందిస్తున్నారని పేర్కొంటున్నారు. అది కూడా 75 నుంచి 85 ఏండ్లు నిండిన వారికే ఇస్తుండడంతో తెలంగాణ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదేండ్లలోనే అన్నిరాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్లాంటి పాలకుడు దేశానికి ప్రధాని అయితే.. దేశంలోని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సముచిత గౌరవం లభిస్తుందంటున్నారు.
మోదీ కాదు.. కేడీ
పెద్ద పదవిలో ఉన్న ఆయన పేరు మోదీ కాదు కేడీ అని పెట్టాలె. ఈ ఏడాది వడ్లు కొనను అంటే మా పిల్లలు తల్లడిల్లిపోయిండ్రు. అందరిలెక్కనే మా కేసీఆర్ సారు కూడా ఉంటే మా పిల్లల పరిస్థితి ఆగమాగం అయితుండే. ఆల్లు కొనకుంటే నేనున్నా అని భరోసా ఇచ్చి అడ్లు కొన్నడు. ఆయనకు తోడు మా పోచారం సారు ఉండుట్ల మా బతుకులు బాగానే ఉన్నయ్. అడ్లు కొన అన్నోళ్లకు కుర్చీమీద కూసునే అర్హత లేదు. మీరు దిగిపోవాలె. మా కేసీఆర్ అసొంటి నాయకుడు ప్రధానిగా ఉంటే దేశం ముంగట పడ్తది.
-మెంగురం విఠల్, వృద్ధుడు, దామరంచ, బీర్కూర్ మండలం
రూ.3016 పింఛన్ తెలంగాణలోనే ఇస్తున్నరు…
దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వలేని విధంగా మన సీఎం కేసీఆర్ రూ.3016 పింఛన్ను అందించడం గర్వంగా ఉంది. ఇంతటి మంచి ముఖ్యమంత్రి దేశ రాజకీయాల్లోకి వెళ్తే నాలాంటి దివ్యాంగులెందరో కష్టాల నుంచి బయటపడి సంతోషంగా ఉంటారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నదే మా కోరిక. ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ను చూసైనా తన పద్ధతులను మార్చుకోవాలి. లేదంటే దేశ ప్రజలు కేంద్రంలో ఉన్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
– కుమ్మరి సాయిలు, దివ్యాంగుడు, బీర్కూర్ గ్రామం.
అన్నలా ఆదుకుంటున్నడు
నూరేండ్లు తోడుంటానని పెళ్లి చేసుకున్న భర్త వదిలేస్తే.. తోడబుట్టిన అన్నలా నెలకు రూ.2016 ఇచ్చి మా కుటుంబాన్ని ఆదుకుంటున్నడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం మా అదృష్టం. తల్లిదండ్రులు వద్దన్నా.. కట్టుకున్న భర్త కాదన్నా, కేసీఆర్ ఉన్నంత కాలం మాలాంటి ఒంటరి మహిళలకు ఏం భయం లేదు. కేసీఆర్లాంటి వ్యక్తి దేశాన్ని ఏలితే.. దేశంలోని మహిళలందరికీ భరోసా ఉంటుంది. ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుసుడు ఖాయమే.
-బస్వాపురం పీరమణి, ఒంటరి మహిళ, బరంగేడ్గి, బీర్కూర్ మండలం.
కేసీఆర్ మాకు దేవుడయ్యిండు
భర్త చనిపోయిన నాలాంటి వాళ్లను ఆదుకొని సీఎం కేసీఆర్ దేవుడయ్యిండు. నెల మర్లిసూడంగనే రూ.2016 అందిస్తున్నడు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన వాళ్లకు అండగా ఉంటున్న నేత.. దేశానికి పెద్ద అయితే దేశంలో ఉన్న నాలాంటి వాళ్లను ఆదుకుంటడు. ఆసరాగా ఉంటడు. ఆయన సల్లంగా ఉండాలి.
-మొగితప్పేట లక్ష్మి, వితంతువు, కిష్టాపూర్, బీర్కూర్ మండలం.
దివ్యాంగులను పట్టించుకోవాలి..
తెలంగాణ మాదిరిగా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులను పట్టించుకోవడం లేదు. అధికారంలో ఉండి మతతత్వాన్ని రెచ్చగొట్టడమే కాదు. దివ్యాంగులను కూడా కాస్త పట్టించుకోవాలి. దేశంలోని దివ్యాంగులందరికీ రూ. 3016 పింఛన్ను తప్పకుండా అందించాలి. లేదంటే అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు గద్దె దిగాలి. తెలంగాణను చూసి అక్కడి ప్రజలు కచ్చితంగా గద్దె దించుతారు.
-ఎండీ. అహ్మద్ హుస్సేన్, దివ్యాంగుడు, బీర్కూర్.
దేశానికి పెద్ద కొడుకు కావాలి
తెలంగాణలో మాదిరిగా సీఎం కేసీఆర్ దేశానికి పెద్ద కొడుకు కావాలి. నెల రాగానే దర్జాగా మేము తీసుకుంటున్న రూ. 2016 పింఛన్ దేశంలోని నాలాంటోల్లందరూ అందుకోవాలి. మాలాంటి ముసలోల్లకు ఈ కాలంలో వేయి రూపాయ లు సరిపోవు. ఈ విషయాన్ని మోదీ ఆలోచించాలి.
-రఘుపతి పర్వవ్వ, వృద్ధురాలు, దామరంచ,
బీర్కూర్ మండలం.
కార్మికులకు ఎక్కడా పింఛన్ లేదు..
దేశంలో ఎక్కడా కల్లు గీసే గీత కార్మికులు, బట్టలు అల్లే చేనేత కార్మికులకు పింఛన్లు లేవు. కానీ తెలంగాణలో మనసున్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నందున అది సాధ్యమవుతున్నది. సీఎం కేసీఆర్ దేశానికి ప్రధాని అయ్యి.. దేశవ్యాప్తంగా ఉన్న గీత, చేనేత కార్మికులను ఆదుకోవాలి. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీతో ఈ పనులు సాధ్యం కావు. కుల, మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడమే ఆయన పని. సీఎం కేసీఆర్ లాంటి సమర్థుడైన నాయకుడు దేశాన్ని ఏలాలి.
-శ్రీరాం సాయాగౌడ్,గీత కార్మికుడు, భైరాపూర్