నిజాంసాగర్, జూలై19: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు నీటిని సోమవారం ఎమ్మెల్యే హన్మంత్ షిండే విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458.00 మీటర్లకు (1.23 టీఎంసీలు) గాను సోమవారం సాయంత్రానికి 457.80 మీటర్ల (1.18 టీఎంసీలు) వద్ద ఉన్నది. ఎగువ ప్రాంతం నుంచి 361 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా వస్తుండగా 75 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా ఆయకట్టుకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న తొమ్మిది వేల ఎకరాలకు ఇన్ఫ్లోకు అనుగుణంగా నీటిని విడుదల చేయనున్నారని చెప్పారు. కార్యక్రమంలో ఈఈ సోలోమన్, డీఈఈ దత్తాద్రి, ఏఈ రవీందర్, ఎంపీపీ యశోద, మార్కెట్ కమిటీ చైర్మన్ సాయాగౌడ్, నాయకులు గంగాధర్, నీలూ పటేల్, డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ నీటి విడుదల
నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న వానకాలం పం టల కోసం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా వెయ్యి క్యూసెక్కుల చొప్పున సోమవారం నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు డీఈఈ శ్రావణ్కుమార్ తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి మొదటి విడుతగా వారం రోజుల పాటు నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వర్షాల కారణంగా నిలిపివేశామని తెలిపారు. ఆయకట్టు కింద లక్షా 15వేల ఎకరాలు ఉండగా, వాటిలో కొంత మంది రైతులకు ప్రస్తుతం సాగు నీరు అవసరం ఉందని, ఆ మేరకు నీటిని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1405.00 అడుగులకు(17.80 టీఎంసీలు) గాను 1396.33 అడుగుల (7.87 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని తెలిపారు.
శ్రీరాంసాగర్కు 12,658 క్యూసెక్కుల వరద
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి 12,658 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ నీటిమట్టం స్వల్పంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. ఈ సీజన్లో ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 56 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. కాకతీయ కాలువకు 50 క్యూసెక్కులు, గుత్ప, అలీ సాగర్ ఎత్తి పోతల పథకాలకు 630 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నదని వివరించారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1086.40 అడుగుల (71.310 టీఎంసీలు) వద్ద ఉన్నదని ఏఈఈ వంశీ తెలిపారు.