చారిత్రక ప్రదేశాలు, నిర్మాణాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వాటి రక్షణ, విశిష్టత గురించి తెలియచేయడానికి కొన్ని ప్రమాణాలను తీసుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తిస్తుంది. ఇప్పటి వరకు యునెస్కో భారత దేశంలో 38 వారసత్వ కట్టడాలకు ప్రపంచ వారసత్వ హోదాను కల్పించింది. తాజాగా రామప్ప, ధోలవీరాకు గుర్తింపు ఇవ్వడంతో ఆ సంఖ్య 40కు చేరింది. వీటిలో 32 సాంస్కృతిక, 7 సహజ, 1 మిశ్రమ సంపదలున్నాయి. ఈ మేరకు ప్రపంచంలో 40 అంతకుమించి ప్రపంచ వారసత్వ సంపద ప్రదేశాలు గల ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ స్థానం సంపాదించింది.
దేశంలో మొదటిసారిగా 1983లో ఆగ్రా కోట, ఎల్లోరా గుహలు, తాజ్మహల్కు ఈ హోదా లభించింది. దేశంలోని ముఖ్యమైన ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి నిపుణ పాఠకుల కోసం…
మొత్తం 40..
రామప్ప
భిన్నశైలి, శిల్పకళానైపుణ్యం, టెక్నాలజీ తదితర ఎన్నో అరుదైన అర్హతలు ఉండటంతో 2020 సంవత్సరానికి ప్రపంచస్థాయి కట్టడంగా రామప్ప దేవాలయాన్ని యునెస్కో గుర్తించింది. తెలుగు నేలపై యునెస్కో గుర్తింపు పొందిన మొదటి చారిత్రక కట్టడంగా రామప్ప నిలిచింది. వందల ఏండ్ల నాటి ఇంజినీరింగ్ నైపుణ్యం, నీటిలో తేలియాడే ఇటుకలు, అద్దంలో ప్రతిబింబాన్ని చూసే నల్లరాతి శిల్పాలు, ఇసుకను పునాది కింది కుషన్గా వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీ, సూదిమొన కంటే సన్నటి సందులతో నగిషీలు.. ఈ అద్భుతాలన్నీ ఒకే చోటు కలిస్తేనే రామప్ప. ఇంతటి విశిష్టతలున్న రామప్ప తెలంగాణ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటింది.
ధోలవీర
గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలో ఉన్న హరప్పా నాగరికత కాలం నాటి నగరం ‘ధోలవీర’ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తిస్తూ జూలై 27, 2021న యునెస్కో ప్రకటించింది. దీంతో దేశంలో మొత్తం 40 కట్టడాలు, ప్రాంతాలు యునెస్కో జాబితాలో చేరాయి. ధోలవీరాలో క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ 1800 సంవత్సరం వరకు సుమారు 1200 ఏండ్ల పాటు సింధులోయ నాగరికత విలసిల్లింది. అప్పటి కట్టడాలు, వస్తువులు, ఆధారాలు పురాతత్వశాఖ తవ్వకాల్లో లభించాయి.
ఎల్లోరా గుహలు
మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లో రా గుహలు ఉన్నాయి. మొత్తం 34 గుహలు ఉన్నాయి. రాతితో మలిచిన ఈ గుహలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. ఇవి సుమారుగా క్రీ.శ 600 నుంచి 1000 సంవత్సరాల నాటివిగా చెబుతారు. ఇంకా ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా గుర్తింపు పొందాయి. చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాల్లో హిందూ మత వైభవాన్ని ఇవి చాటిచెబుతాయి.
ఎలిఫెంటా గుహలు
ఎలిఫెంటా గుహలు హిందూ, బౌద్ధమతస్తుల గుహలు. ఇవి ముంబైకి సమీపంలో అరేబియా సముద్రంలో ఉన్న ఎలిఫెంటా అనే దీవిలో ఉన్నాయి. ఈ గుహలు సుమారు 5 నుంచి 8వ శతాబ్దం నాటివి. ఈ గుహలకు యునెస్కో 1987లో వారసత్వ ప్రదేశ గుర్తింపునిచ్చింది.
హిల్ ఫోర్ట్స్ (రాజస్థాన్)
రాజస్థాన్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో ఉన్న కొన్ని హిల్ఫోర్ట్స్కు ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు లభించింది. ఈ కోటల్లో చిత్తోర్ఘర్ కోట, కుంభల్ఘర్ ఫోర్ట్, జైసల్మేర్ ఫోర్ట్, గాగ్రోన్ ఫోర్ట్, రణథంబోర్ కోటలు ప్రధానమైనవి. ప్రతి కోట విశేష అంశాలను యునెస్కో జాబితాలో 2013లో చేర్చారు.
ఖజురహో స్మారక కట్టడాలు
మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంది. ఇది వింధ్య పర్వత శ్రేణులకు వ్యతిరేకదిశలో ఉన్న కుగ్రామం. క్రీ.శ 11వ శతాబ్దం నాటి హిందూ, జైన దేవాలయాలు క్లిష్టమైన వాస్తుశిల్పానికి ఖజురహో స్మారక కట్టడాలు పెట్టింది పేరు. ఈ ఆలయ సముదాయం శృంగార శిల్పాలకు ప్రసిద్ధి. 1986లో దీనికి యునెస్కో గుర్తింపునిచ్చింది.
కోణార్క్ సూర్యదేవాలయం
కోణార్క్ సూర్యదేవాలయం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. 13వ శతాబ్దం (గాంగ వంశానికి చెందిన లాంగువా నరసింహదేవ క్రీ.శ 1236-1264) నిర్మించిన ఈ దేవాలయం సూర్య భగవానుడి కోసం ఒక రథం ఆకారంలో 24 చక్రాలతో, ఆరు అందమైన గుర్రాలతో నిర్మించారు. 1200 మంది శిల్పులు 16 ఏండ్లపాటు దీనిని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఇంకా దీనిని మైత్రేయవనమని పిలుస్తారు. 1984లో ప్రపంచ వారసత్వ హోదా లభించింది.
ఆగ్రాకోట
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఉంది. దీనిని రెడ్ ఇసుక రాతితో నిర్మించడం వల్ల రెడ్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. ఈ కోట నిర్మాణ శైలి పర్షియా, ఇండియా శిల్పకళాశైలి కలిగి ఉంటుంది. ఈ కోటలో ప్యాలెస్లు, టవర్స్, మసీదులు ఉన్నాయి. క్రీ.శ 16, 18 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. దాదాపు 94 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ గంభీరమైన కోటకు లాహోర్ ద్వారం, ఢిల్లీ ద్వారం అనే రెండు ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయి. దీనికి యునెస్కో 2007లో వారసత్వ హోదా ఇచ్చింది.
తాజ్మహల్
ఢిల్లీలోని ఆగ్రా దగ్గర ఉన్న ఈ స్మారక కట్టడాన్ని షాజహాన్ తన భార్య ముంతాజ్పై ప్రేమకు గుర్తుగా నిర్మించాడు. భారతీయ, ఇస్లామిక్, పర్షియన్ నిర్మాణశైలిలో 73 మీటర్ల ఎత్తుతో (1632 నుంచి 1653 వరకు 22 ఏండ్లపాటు) నిర్మించారు. 20 వేల మంది కార్మికులు దీని నిర్మాణంలో పాలుపంచుకోగా.. వివిధ డిజైన్లను 28 రకాల రాళ్లతో చెక్కారు. శతాబ్దాలు గడిచినా నేటికీ చెక్కుచెదరకుండా నిలిచిన ఈ ప్రేమ మందిరానికి 1983లో యునెస్కో గుర్తింపునిచ్చింది. దీని వాస్తుశిల్పి ఉస్తాద్ అహ్మద్ లౌరి.
జంతర్ మంతర్
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్లోని చారిత్రక కట్టడమే జంతర్మంతర్. దీన్ని యునెస్కో ఖగోళ నైపుణ్యాల గుట్టగా అభివర్ణించింది. ఈ పురాతన కట్టడాన్ని మహారాజ జైసింగ్-2 నిర్మించాడు. తన సామ్రాజ్యం కోసం జైపూర్ను కొత్త రాజధానిగా 1727-34 మధ్య కాలంలో నిర్మించాడు. జంతర్మంతర్ లాంటి ఐదు కట్టడాలను వివిధ ప్రాంతాల్లో నిర్మించగా.. వీటిలో ఒకటి ఢిల్లీలో ఉంది. మిగిలిన కట్టడాలు ఉజ్జయిని, మధుర, వారణాసిలో ఉన్నాయి. 2010లో దీనికి ప్రపంచ వారసత్వ హోదా లభించింది.
రాణీకి వావ్ (గుజరాత్)
పఠాన్లో సరస్వతి నది ఒడ్డున ఉన్న ఈ కట్టడాన్ని క్రీ.శ 11వ శతాబ్దంలో రాజా భీమ్దేవ్-1 తన రాణి ఉదయమతి స్మారకంగా నిర్మించాడు. ఈ వివరణాత్మకమైన మెట్లబావి భారత ఉపఖండంలో భూగర్భజల వనరులు, నిల్వవ్యవస్థ సాధారణ రూపాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కట్టడం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల్లో బయటపడింది. ఈ మెట్లబావి ఏడు స్థాయి మెట్లతో విలోమ ఆలయం వలే రూపొందించారు. సుమారు 500 శిల్పాలు ఇక్కడ కనిపిస్తాయి. 2014లో యునెస్కో గుర్తించింది.
ఫతేపూర్ సిక్రీ
యూపీలోని ఫతేపూర్ సిక్రీని అక్బర్ 16వ శతాబ్దంలో నిర్మించాడు. 14 సంవత్సరాల తర్వాత అక్కడ నీరు లేకపోవడంతో నిర్లక్ష్యంగా మారింది.
చోళ దేవాలయాలు
తమిళనాడులోని తంజావూర్లో చోళ వంశ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయం. గంగై కొండ చోలీస్వరం టెంపుల్, దరాసురంలోని ఐరావతేశ్వర టెంపుల్స్ 12వ శతాబ్దం నాటివి. ఈ దేవాలయాల శిల్పశైలికి గాను యునెస్కో 1987, 2004లో గుర్తింపునిచ్చింది.
తెలుగు రాష్ర్టాల్లో ఇదే మొదటిసారి…
భారత్లో 2021, జూలై 25 నాటికి 38 ప్రాంతాలు/కట్టడాలకు మాత్రమే యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. ముఖ్యంగా ఇందులో దక్షిణ భారతం నుంచి (తమిళనాడులో రెండు, కర్ణాటక రెండు, కేరళ ఒకటి) మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు తెలుగు రాష్ర్టాల నుంచి ఏ ఒక్క చారిత్రక ప్రదేశానికి యునెస్కో గుర్తింపు రాలేదు. తాజాగా రామప్ప ఆ క్రెడిట్ను దక్కించుకుంది. తెలుగు రాష్ర్టాల్లో మొదటిది కాగా.. దేశంలో 39వదిగా, దక్షిణభారతదేశంలో ఆరో ప్రాంతం/కట్టడంగా యునెస్కో జాబితాలో నిలిచింది. కాకతీయ రాజు గణపతిదేవ పాలనలో ఈ ఆలయాన్ని నిర్మించారు. 1213లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, జలపాతాలు క్రీస్తుపూర్వం నుంచి రాష్ట్రంలో ఎన్నో ఉన్నా.. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు సాధించి కాకతీయ శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది.