UGC Chariman | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (నమస్తే తెలంగాణ): దేశంలో విదేశీ వర్సిటీలకు చెందిన క్యాంపస్లను ఏర్పాటు చేసే అవకాశాలు పరిశీలిస్తున్నామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ ఎం జగదీశ్కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఆస్ట్రేలియావంటి పలు దేశాలకు చెందిన విదేశీ యూనివర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకొంటున్నట్టు చెప్పారు. దేశంలో ప్రతి ఇంట్లో గ్రాడ్యుయేట్లు ఉండేలా ‘నేషనల్ డిజిటల్ యూనివర్సిటీ’ (ఎన్డీయూ)ని అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. జాతీయ విద్యా విధానం-2020 (ఎన్ఈపీ 2020) అమలులో ఉస్మానియా యూనివర్సిటీ మిగతా వర్సిటీలకు రోల్ మాడల్గా ఎదగాలని సూచించారు. ఓయూలో కొత్తగా నిర్మించిన యూజీసీ-హెచ్ఆర్డీసీ నూతన భవనాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
భారతదేశంలో సంపన్న వర్గాల కంటే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఎందరో విద్యార్థుల్లో విశేష ప్రతిభ దాగి ఉన్నదని జగదీశ్కుమార్ వెల్లడించారు. ఆర్థికంగా లేకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు విదేశీ వర్సిటీల్లో విద్యనభ్యసించలేకపోతున్నారని చెప్పారు. విదేశీ విద్యను భారతీయుల ముంగిట్లోకి తీసుకొచ్చేందుకు ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికాల్లోని వర్సిటీలతో పరస్పర అవగాహన ఒప్పందం చేసుకొంటున్నామని తెలిపారు. గత వారంలో 20 దేశాలకు చెందిన పలు వర్సిటీల వైస్ చాన్స్లర్లతో ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. వారంతా భారత్లో విదేశీ వర్సిటీ క్యాంపస్లు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపారని తెలిపారు. వీటి ఏర్పాటుతో భారతీయ విద్యార్థులు ఎంఎస్తోపాటు పలు రకాల విదేశీ కోర్సులు తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చని వెల్లడించారు.
ఎన్ఈపీ -2020 ప్రకారం నేషనల్ అసెస్మెంట్ ఆఫ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ప్రక్రియలో కొన్ని సంస్కరణలు తీసుకొస్తున్నామని జగదీశ్కుమార్ వెల్లడించారు. న్యాక్ గుర్తింపు కోసం ఇకనుంచి పాయింట్లు, గ్రేడ్లు ఉండబోవని తెలిపారు. కేవలం న్యాక్ గుర్తింపే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాక్ సంస్థ కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు.
ఇంటింటికీ డిగ్రీలు అందించాలన్న లక్ష్యంతో దేశంలో నేషనల్ డిజిటల్ వర్సిటీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని జగదీశ్కుమార్ వెల్లడించారు. జూలైలో పలు రకాల సర్టిఫికెట్, స్కిల్డ్ కోర్సులకు ప్రవేశాలు కల్పించబోతున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జూలై నుంచి పలు రకాల డిగ్రీ కోర్సులు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నా రు. ఇది సెంట్రల్ యూనివర్సిటీ మాదిరిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ఎన్డీయూ ఏర్పాటు కోసం బిల్లు సిద్ధమవుతున్నదని, త్వరలోనే పార్లమెంట్ చట్టం ద్వారా దీనికి పూర్తి స్థాయిలో ఆమోదం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
రాష్ట్ర యూనివర్సిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని జగదీశ్కుమార్ వెల్లడించారు. ఇందుకోసం టీచింగ్ ఫ్యాకల్టీ నియామకాలు జరుపాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూనివర్సిటీలు పరిశోధనలకు ప్రాధాన్యం కల్పించాలని సూచించారు. యూనివర్సిటీ డిగ్రీల్లో మల్టీ డిసిప్లినరీ, మల్టీ ఎంట్రీ విధానం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. యూజీసీ, ఏఐసీటీఈ, పీసీఐవంటి పలు రకాల విద్యా సంస్థలను ఒకే గొడుకు కిందకు తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నదని, ఇందుకోసం త్వరలోనే హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) ఏర్పాటు చేయబోతున్నదని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (సీయూఈటీ)కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నదని, ఈ సీయూఈటీ పరిధిలోకి మరికొన్ని వర్సిటీలు, ప్రైవేట్, డీమ్డ్తోపాటు కొన్ని విద్యా సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో సీయూఈటీకి దరఖాస్తు చేసుకొనేందుకు విద్యార్థులకు మరింత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు చెప్పారు.