తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. త్వరలోనే గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే గ్రూప్-2 కింద 663 పోస్టులు, గ్రూప్-3 కింద 1373 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఈ పోస్టుల భర్తీపై టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం ఆయా శాఖల హెచ్వోడీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సుమారు 100 మంది అధికారులు తమ శాఖల పరిధిలోని ఖాళీలు, సమస్యలు, తదితర అంశాల గురించి వివరించారు.
సర్వీస్ రూల్స్, సవరణలు, క్లారిఫికేషన్లు, రోస్టర్ విధానం, ఫార్వర్డ్ ఖాళీలు, అర్హతలు, తదితర విషయాలన్నీ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్రెడ్డి వారికి వివరించారు. ఆ తర్వాత వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జనార్దన్రెడ్డి మాట్లాడుతూ… త్వరితగతిన గ్రూప్-2, 3 ఉద్యోగాలకు నోటిఫికేన్లు ఇవ్వనున్నట్టు తెలిపారు. అన్ని శాఖల అధికారుల సహకారంతోనే ఇది సాధ్యమని చెప్పారు. వీలైనంత త్వరగా ఆయాశాఖల అధికారులు పూర్తి ఇండెంట్లు టీఎస్పీఎస్సీకి సమర్పించాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.