NEET-UG | దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, ఆయుర్వేదం, యునానీ, హోమియోపతి, ఆయుష్, పారామెడికల్, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకోసం నిర్వహించే మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (Medical entrance exam) నీట్ యూజీ-2023కు (NEET UG) దరఖాస్తులు భారీగా పెరిగాయి. నీట్ యూజీ-2023 దరఖాస్తు గడువు ఈ నెల 6న ముగిసింది. గడువు ముగిసేనాటికి మొత్తం 21 లక్షల మందికిపైగా అభ్యర్థులు తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు. ఇది గతేడాది కంటే సుమారు 3 లక్షలకుపైగా అధికం. 2022లో దేశవ్యాప్తంగా 18 లక్షల 72 వేల మంది నీట్ యూజీకి దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఈ ఏడాది సుమారు 20 లక్షలకుపైగా అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని విద్యావేత్తలు అంచనావేస్తున్నారు.
కాగా, ఈ దరఖాస్తులు పెరగడానికి ప్రధాన కారణం ఈ ఏడాది నుంచి ఎంబీబీఎస్తోపాటు డెంటల్ కోర్సులు, ఆయుర్వేద, యునానీ, హోమియోపతి, ఆయుష్ లోని వెజటరీ కోర్సులు, పారామెడికల్, నర్సింగ్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తుండటమేనని పేర్కొన్నారు. ఈ ఏడాది నీట్ యూజీ పరీక్ష మే 7న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించింది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తెలుగు, తమిళ్, ఉర్దూ, పంజాబీ, ఒడియా, మరఠీ, మలయాళం, కన్నడ, గుజరాతి, బెంగాళి, అస్సామీ, హిందీ, ఇంగ్లిష్ సహా మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. కాగా, నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైన విషయం తెలిసిందే.