హైదరాబాద్: జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి విడుత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. పరీక్ష రాసిన విద్యార్థులు ఫలితాలను ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు. రాష్ట్రానికి చెందిన యశ్వంత్, ఆంధ్రప్రదేశ్కు చెందిన పీ. ఆదినారాయణ వంద పర్సంటైల్ సాధించారు. , వీరితోపాటు కే.ధీరజ్, అనికేత్ చటోపాధ్యాయ, రూపేశ్ టాప్స్కోరర్లుగా నిలిచారు.
జేఈఈ మెయిన్ పరీక్షలు జూన్ 23 నుంచి 29 వరకు ఎన్టీఏ నిర్వహించింది. ఈ నెల 6న ఫైనల్ కీని విడుదల చేసింది. తాజాగా ఫలితాలను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in, nta.ac.in, ntaresults.nic.in లో అందుబాటులో ఉంచింది. అయితే ప్రస్తుతానికి జేఈఈ మెయిన్ పేపర్-1 (బీఈ, బీటెక్) సంబంధించిన ఫలితాలను మాత్రమే విడుదల చేసింది. పేపర్-2 (బీఆర్క్, బీ ప్లానింగ్) ఫలితాలు విడుదలవ్వాల్సి ఉన్నది. ఈఏడాది రాష్ట్రం నుంచి 50 వేలకుపైగా విద్యార్థులు మొదటి విడుత పరీక్షలకు హాజరయ్యారు.