న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్ (JEE Main) మొదటి సెషన్ పరీక్ష తేదీలను ఎన్టీఏ రీ షెడ్యూల్ చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నుంచి 21 మధ్య జేఈఈ పరీక్ష జరగాల్సి ఉన్నది. అయితే అవే తేదీల్లో వివిధ రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు జరుగనున్నాయి. దీంతో విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష తేదీల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్పు చేసింది. తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 21, 24, 25, 29 తేదీల్లో, మే 1, 4 తేదీల్లో జేఈఈ మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
దీనికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారంలో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని, అదే నెల రెండో వారం నుంచి అభ్యర్థులు అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. విద్యార్థుల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
జేఈఈ మొదటి సెషన్కి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్నది. మార్చి 31 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రెండో సెషన్కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 8 నుంచి మే 3 వరకు కొనసాగనుంది. విద్యార్థులు పూర్తి సమాచారం కోసం jeemain.nta.nic.in, nta.ac.in వెబ్సైట్లు చూడవచ్చు.