న్యూఢిల్లీ: యూనివర్సిటీలు, గుర్తింపు పొందిన కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్ చేయడానికి అర్హత పరీక్ష అయిన నెట్ నోటిఫికేషన్ను యూజీసీ (UGC NET) విడుదల చేసింది. అయితే అప్లికేషన్ ఫీజులను 10 శాతం మేర పెంచింది. గతంలో జనరల్ అభ్యర్థులు రూ.1000 చెల్లిస్తే సరిపోయేది. ప్రస్తుతం అది రూ.1100కు పెరిగింది. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారు రూ.500కు బదులు రూ.550 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఇతరులు అప్లికేషన్ ఫీజులో (రూ.275) ఎలాంటి మార్పులేదు.
యూజీసీ నెట్ అప్లికేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మే 20 వరకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. జూన్లో పరీక్షను నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్నది.
యూజీసీ ఏటా రెండు పర్యాయాలు నెట్ పరీక్షను నిర్వహిస్తున్నది. అయితే 2021 డిసెంబర్లో జరగాల్సిన పరీక్ష కరోనా కారణంగా రద్దయింది. దీంతో ఈ ఏడాది జూన్ ఎడిషన్తో కలిపి దానిని నిర్వహిస్తున్నది. మొత్తం 82 సబ్జెక్టుల్లో ఈ అర్హత పరీక్ష ఉండనుంది.