ఎల్ఎన్జీతో నడిచే నౌక
ప్రపంచంలో తొలి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)తో నడిచే నౌక ఎల్ఎన్జీని నింపుకోవడానికి ఫిబ్రవరి 7న సింగపూర్కు చేరింది. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు ఆస్ట్రేలియన్ మైనింగ్ కంపెనీ అయిన బీహెచ్పీ తీసుకొస్తున్న ఐదు బల్క్ క్యారియర్ నౌకలో మొదటిది ‘ఎంబీ ఎంటీ టూర్మలైన్ న్యూక్యాజిల్మ్యాక్స్’. 2050 నాటికి సున్నా శాతం కర్బన ఉద్గారాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు బీహెచ్పీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వందిత పంత్ పేర్కొన్నారు.
అమెరికా-తైవాన్
తైవాన్లో క్షిపణి రక్షణ వ్యవస్థ కోసం 100 మిలియన్ డాలర్ల సాయానికి అమెరికా ఆమోదం తెలిపిందని పెంటగాన్ ఫిబ్రవరి 7న వెల్లడించింది. చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తైవాన్లో క్షిపణి రక్షణ వ్యవస్థను ఈ నిధులతో పటిష్టం చేయనున్నది. తైవాన్ వద్ద ప్రస్తుతం ఉన్న గగనతల క్షిపణులు, అమెరికా అందించే అధునాతన పేట్రియాట్ క్షిపణుల నిర్వహణకు తోడ్పడనున్నది.
పల్సెస్ డే
ఐక్యరాజ్యసమితి గుర్తించిన వరల్డ్ పల్సెస్ డే (ప్రపంచ పప్పుధాన్యాల దినోత్సవం)ని ఫిబ్రవరి 10న నిర్వహిస్తారు. ఈ సంవత్సర దీని థీమ్ ‘పల్సెస్ టు ఎంపవర్ యూత్ ఇన్ అచీవింగ్ సస్టెయినబుల్ అగ్రిఫుడ్ సిస్టమ్స్ (స్థిరమైన వ్యవసాయ ఆహార వ్యవస్థలను సాధించడంలో యువతను శక్తిమంతం చేయడానికి పప్పులు)’.
నాసా మిషన్లు
నిరంతరం మారుతున్న అంతరిక్ష వాతావరణం, సూర్యుడు-భూమి కనెక్షన్ గురించి తెలుసుకునేందుకు రెండు మిషన్లను ఎంపిక చేశామని నాసా ఫిబ్రవరి 10న వెల్లడించింది. మల్టీ-స్లిట్ సోలార్ ఎక్స్ప్లోరర్ (ఎంయూఎస్ఈ), హేలియోస్వార్మ్ అనే రెండు సైన్స్ మిషన్ ఎంపిక చేసింది. ఇవి వ్యోమగాములు, ఉపగ్రహాలు, జీపీఎస్ సిగ్నళ్లను రక్షించడం కోసం క్లిష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. ఎంయూఎస్ఈ మిషన్ సూర్యుని కరోనా హీటింగ్ చోదక శక్తులను అర్థం చేసుకోవడంలో సైంటిస్టులకు సహాయపడుతుంది.
కోలా
అంతరించిపోతున్న జంతువుగా కోలాను గుర్తించినట్లు ఆస్ట్రేలియా ఎన్విరాన్మెంట్ మంత్రి సుసాన్ లే ఫిబ్రవరి 11న తెలిపారు. వాతావరణ మార్పులు, వ్యాధులు, నివాసయోగ్యం లేకపోవడం వల్ల ఈ జాతి అంతరించే దశకు వచ్చిందన్నారు. వీటి సంరక్షణ కోసం ప్రణాళిక చేస్తామన్నారు.
వన్ ఓషన్
ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు సహకారంతో బ్రెస్ట్లో ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు వన్ ఓషన్ సమ్మిట్ను ఫ్రాన్స్ వర్చువల్గా నిర్వహించింది. ఈ సమ్మిట్లో భారత్, యూకే, దక్షిణ కొరియా, కెనడా పాల్గొన్నాయి. ఈ సమావేశంలో ‘బయోడైవర్సిటీ బియోండ్ నేషనల్ జూరిస్డిక్షన్ (బీబీఎన్జే)’ని యూరోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ ప్రారంభించారు.