Study Abroad | హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే ఉంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య 80 శాతానికిపైగా ఉంటున్నదని నిపుణులు పేర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారి సంఖ్య ఏటా పెరుగుతున్నదని చెప్తున్నారు. ఇక గతంలో విదేశీ చదువులంటే అబ్బాయిలే ఆసక్తి చూపేవారు.
తాజాగా అమ్మాయిలు అబ్బాయిలను మించి విదేశీ చదువులను అందిపుచ్చుకొంటున్నారు. మన దేశం నుంచి వెళ్తున్న వారిలో అత్యధికులు కెనడా, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్లను ఎంచుకొంటున్నారు. ఆ తర్వాత స్థానం లో ఉబ్జెకిస్తాన్, పిలిప్పీన్స్, రష్యా, ఐర్లాండ్, కిర్గిస్తాన్, కజకిస్తాన్ తదితర దేశాలున్నాయి. 2022లో యూఎస్కు వెళ్లిన వారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం స్ప్రింగ్ సీజన్ ప్రవేశాలు షురూ కావడంలో మళ్లీ విదేశీ చదువుల కోలాహలం ప్రారంభమైంది. ఇప్పటికే అధిక సంఖ్యలో మధ్య తరగతి విద్యార్థులే రిజిస్ట్రేషన్ చేసుకొన్నట్టుగా కన్సల్టెన్సీల నిర్వాహకులు పేర్కొంటున్నారు.
విదేశీ విద్యకోసం వస్తున్న దరఖాస్తుల్లో తెలంగాణ నుంచే అధికంగా వస్తున్నా యి. మా సంస్థలో ఇప్పటివరకు 10వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొన్నారు. ఇందులో ఏపీ వాళ్లు 490 మంది విద్యార్థులు కాగా, తెలంగాణ నుంచి అత్యధికంగా 9,383 మంది విద్యార్థులు ఉన్నారు. జాతీయంగా 41 వేల మంది విద్యార్థులు నమోదు చేసుకొన్నారు.
– అమిత్సింగ్, యూనిస్కాలర్స్ వ్యవస్థాపకుడు
విదేశీ చదువుల కోసం ప్రతి నెలా 12 వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొంటున్నారు. వీరిలో అత్యధికులు మధ్యతరగతి వర్గాలకు చెందిన వారే. అరిజోనా స్టేట్ వర్సిటీలో చేరేందుకు అత్యధికులు ఉత్సుకత చూపుతున్నారు. ఆ తర్వాత ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ రెండో స్థానంలో ఉన్నది. ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకొనే ఆరాటంలో భాగంగానే విద్యార్థులు విదేశీ చదువులను ఇష్టపడుతున్నారు.
– వైభవ్గుప్తా, ఐస్కూల్ కనెక్ట్, సహ వ్యవస్థాపకుడు