JEE Main | జేఈఈ 2023 రెండో సెషన్ రిజిస్ట్రేషన్లు ఇవాల్టి నుంచి ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
రెండవ సెషన్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) షెడ్యూల్ ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 7 న రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. ఆన్లైన్ ద్వారా మగ అభ్యర్థులు రూ.1000, మహిళా అభ్యర్థులు రూ. 800 ఫీజు రూపంలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులకు పరీక్ష సిటీ స్లిప్ను మార్చి మూడో వారంలో జారీ చేసి, చివరి వారంలో అడ్మిట్ కార్డ్ను జారీ చేస్తారు. ఆ తర్వాత ఏప్రిల్ 6 నుంచి 12 వరకు పరీక్ష నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షకు హాజరైన అభ్యర్థులు.. రెండు స్కోర్లలో మెరుగైన స్కోర్ను ఫైనల్గా పరిగణిస్తారు. ఈ ఫైనల్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ని సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. హోమ్ పేజీలో యాక్టివేట్ చేయబడిన లింక్పై క్లిక్ చేయడం ద్వారా JEE మెయిన్ అప్లికేషన్ పేజీకి వెళ్లాలి. మొదట రిజిస్టర్ చేసి, ఆపై నమోదు చేసిన వివరాలతో లాగిన్ చేయడం ద్వారా దరఖాస్తును సమర్పించాలి.