చెన్నై : ఐఐటీ మద్రాస్ విద్యార్ధులకు 2021-22 విద్యాసంవత్సరంలో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ (పీపీఓ) పోటెత్తాయి. ఆన్లైన్లో నిర్వహించిన ఇంటర్న్షిప్ ప్రక్రియలో ప్రముఖ సంస్ధల నుంచి విద్యార్ధులకు ఆఫర్లు వచ్చాయి. ఈ ఏడాది నవంబర్ 5 వరకూ ఐఐటీ మద్రాస్ విద్యార్ధులకు 227 పీపీఓలు వచ్చాయి. గత విద్యా సంవత్సరంలో ఐఐటీ మద్రాస్ విద్యార్ధులకు 186 పీపీఓలు సమకూరాయి.
కీలక ఇంజనీరింగ్ విభాగాలతో పాటు ఆర్అండ్డీ విభాగాల్లో అత్యధిక పీపీఓలు సంస్ధకు లభించాయి. పీపీఓ ద్వారా కంపెనీల గురించి తమ విద్యార్ధులకు అవగాహన పెరగడంతో పాటు ఆయా కంపెనీలకు తాజా నైపుణ్యాలు అందివస్తాయని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సలహాదారు ప్రొఫెసర్ సీఎస్ శంకర్ పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు ప్రారంభమవుతాయని అప్పటివరకూ ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్స్ కొనసాగుతాయని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది.