హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు బీసీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు జూనియర్, డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్ష కోసం మే 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 6న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు 040 23328266 నంబర్లో సంప్రదించాలని కోరారు.
రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్ రాస్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678లో సంప్రదించాలని కోరారు.
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్టు డైరెక్టర్ ఉషారాణి తెలిపారు. జనరల్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.150, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.75 పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు http://telanganams.cgg.gov.in చూడాలని కోరారు.