హైదరాబాద్ : విద్యార్థులను సివిల్స్ వైపు మళ్లించేందుకు వందేండ్ల చరిత్ర కలిగిన ప్రతిష్ఠాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక అడుగు వేసింది. సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏర్పాటులో భాగంగా డైరెక్టర్గా ప్రొఫెసర్ సీ గణేశ్, కో ఆర్డినేటర్గా డాక్టర్ ఈ సుజాతను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది నుంచే సివిల్స్ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ అందించనున్నారు.
సివిల్స్. ఆర్ఆర్బీ, ఎస్ఎస్సీ, బ్యాంకు సర్వీసులతో పాటు గ్రూప్ -1, గ్రూప్ -2 వంటి పలు రకాల పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. విద్యార్థులందరికీ అర్హత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెస్టులో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఉచితంగా తరగతులు నిర్వహించనున్నారు. ఒకేసారి 600 మంది విద్యార్థులకు క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హైదరాబాద్ నుంచి ప్రతి ఏటా 49 వేల నుంచి 50 వేల మంది సివిల్స్ పరీక్షలకు పోటీపడుతున్నారు. వీరిలో అత్యధికులు ప్రైవేట్ సంస్థల్లోనే శిక్షణ పొందుతున్నారు. ఓయూ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారే కావడం, భారీ ఫీజులు చెల్లించే స్థోమత లేకపోవడంతో సివిల్స్ ఆశలను నెరవేర్చుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ద్వారా ఓయూ అధికారులు నాణ్యమైన శిక్షణ ఇవ్వనున్నారు. వర్సిటీలోని ఆచార్యుల చేత విద్యార్థులకు ఎప్పటికప్పుడు మాక్ టెస్టులు, పరీక్షలు నిర్వహించి, విద్యార్థులు చేస్తున్న తప్పులను సరిదిద్దనున్నారు.