1. కింది వాటిలో కైలాస పర్వతం నుంచి ఉద్భవించిన నదులు ఏవి?
1. సింధు 2. బ్రహ్మపుత్ర
3. కర్నాలి 4. సట్లెజ్
సరైన సమాధానాన్ని ఎంచుకోండి?
ఎ) 1, 4 బి) 1, 3, 4
సి) 2, 3, 4 డి) పైవన్నీ
సమాధానం: డి
వివరణ: కైలాస పర్వతం హిమాలయాల ఉత్తర ప్రాంతంలో పశ్చిమ టిబెటన్ పీఠభూమిలో ఉంది. బోన్ (ఒక టిబెట్ మతం), బౌద్ధ, హిందూ, జైన మతాలు ఈ పర్వతాన్ని పవిత్రస్థలంగా భావిస్తాయి. హిందూ మతంలో ఇది శివుని నివాసంగా, శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు. ఈ పర్వతం టిబెట్లోని మానస సరోవరానికి, రాక్షసతాల్ సరస్సుకు సమీపంలో ఉంది.
కైలాస పర్వతం నుంచి నాలుగు నదులు ఉద్భవించాయి. సింధు, బ్రహ్మపుత్ర, కర్నాలీ, సట్లెజ్. అందువల్ల, ఎంపిక డి సరైనది.
నదుల (Rivers) గురించి అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ‘పొటమాలజీ’ అని అంటారు. ఏటా మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని (World Water Day) నిర్వహిస్తారు. సెప్టెంబర్ చివరి ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవాన్ని జరుపుకొంటారు.
బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లున్నాయి. టిబెట్లో త్సాంగ్పో అని, అరుణాచల్ప్రదేశ్లో దిహంగ్ అని, అసోంలో బ్రహ్మపుత్ర అని, బంగ్లాదేశ్లో ‘జమున’ అని పిలుస్తారు. గంగానదితో కలిసిన తర్వాత ’పద్మానది’గా వ్యవహరిస్తారు.
బ్రహ్మపుత్ర నది కైలాస శిఖరాల్లో జన్మించిన తర్వాత తూర్పు దిశగా టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ నామ్చాబార్వా శిఖరం వద్ద దక్షిణ దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అరుణాచల్ప్రదేశ్, అసోం రాష్ర్టాల మీదుగా ప్రవహిస్తూ ‘ధుబ్రి’ వద్ద బంగ్లాదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కొంతదూరం ప్రవహించి ‘గేలుండే’ వద్ద గంగానదితో కలుస్తుంది. చివరికి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయిన సుందర్బన్ను ఏర్పరుస్తుంది. దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్.
టిబెట్ ప్రాంతంలో సింధూ నదిని
‘సింగి-జంబన్’ అని పిలుస్తారు. అంటే ‘సింహపు నోరు’ అని అర్థం. ఇది భారతదేశంలో ఒక్క జమ్మూ కశ్మీర్ రాష్ట్రం మీదుగానే ప్రవహిస్తుంది. దీని ఉపనదులు మాత్రం
హిమాచల్ప్రదేశ్,హరియాణా, పంజాబ్ రాష్ర్టాల మీదుగా ప్రవహిస్తాయి.
సట్లెజ్ నది టిబెట్లోని రాకీస్ సరస్సు వద్ద పుట్టి అక్కడి నుంచి ధౌలాధర్, జస్కర్ పర్వతాల మీదుగా ప్రవహిస్తూ షిప్కిలా కనుమ వద్ద హిమాచల్ప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. చివరికి పాకిస్థాన్లోని ‘మైదాన్కోట్’ వద్ద సింధూ నదిలో కలుస్తుంది. దీని మొత్తం పొడవు 1450 కి.మీ. అయితే భారతదేశంలో ఇది ప్రవహించే దూరం మాత్రం 1050 కి.మీ. భారతదేశంలో ప్రవహించే సింధూ నది ఉపనదుల్లో ఇదే పెద్దది. ఈ నదిపైనే దేశంలోకెల్లా ఎత్తయిన, పెద్ద ఆనకట్ట ’భాక్రానంగల్’ను నిర్మించారు. ఈ నదిని శతద్రు లేదా సతుద్రి అని కూడా పిలుస్తారు.
2. పార్లమెంటరీ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిని పరిగణించండి.
1. క్యాబినెట్ ప్రభుత్వం
2. జవాబుదారీ ప్రభుత్వం
3. వెస్ట్మినిస్టర్ ప్రభుత్వ రూపం
పైన వాటిలో పార్లమెంటరీ ప్రభుత్వాన్ని
ఏ పేరుతో పిలుస్తారు?
ఎ) ఒకటి బి) రెండు
సి) పై మూడూ డి) ఏదీకాదు
సమాధానం: సి
వివరణ: ఐవర్ జెన్నింగ్స్ పార్లమెంటరీ వ్యవస్థను ‘క్యాబినెట్ వ్యవస్థ’ అని పిలిచారు. ఎందుకంటే దానిలో అధికారానికి కేంద్ర బిందువు మంత్రివర్గం. పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ‘జవాబుదారీ ప్రభుత్వం’ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అందులో క్యాబినెట్ (నిజమైన కార్యనిర్వాహక వర్గం) పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది. వారి పదవీకాలం పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. పార్లమెంటరీ వ్యవస్థకు దారితీసిన బ్రిటిష్ పార్లమెంట్ ఆవిర్భావం తర్వాత దీన్ని ‘వెస్ట్మినిస్టర్ మోడల్ ఆఫ్ గవర్నమెంట్’ అని కూడా పిలుస్తారు. అందువల్ల ఎంపిక (సి) సరైన సమాధానం.
3. ‘గ్రే జోన్ కార్యకలాపాలు’ అనే పదం దేనితో ముడిపడి ఉంది?
ఎ) అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించటం
బి) ఉష్ణమండల తుఫానుల ముందస్తు
హెచ్చరిక వ్యవస్థ సి) సైబర్ వార్ఫేర్
డి) పోషకాహార లోపాన్ని నివారించడానికి వ్యూహాత్మక జోక్యం సమాధానం: సి
వివరణ: అంతర్జాతీయ సంబంధాల్లో ఇటీవల కాలం లో విస్తృతంగా ప్రచారంలో ఉన్న పదం గ్రే జోన్ వార్ఫేర్. అంతర్జాతీయ భద్రతకు ఇది సవాలుగా నిలుస్తుంది. గ్రే-జోన్ అనే పదాన్ని యునైటెడ్ స్టేట్స్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ రూపొందించి 2015 శ్వేతపత్రంలో ప్రచురించింది.
గ్రే జోన్ వార్ఫేర్లో ఉపయోగించే వ్యూహాలు
సైబర్ ఆపరేషన్స్: లక్ష్య వ్యవస్థల్లోకి చొరబడటానికి, అంతరాయం కలిగించడానికి లేదా సమాచారాన్ని తారుమారు చేయడానికి సైబర్ సామర్థ్యాలను ఉపయోగిస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాలపై సైబర్ దాడులు, గూఢచర్యం లాంటివి ఇందులో ఉపయోగించే సాధారణ వ్యూహాలు.
4. బయోమాస్ ఎనర్జీ అంటే ఏమిటి?
ఎ) మొక్కలు, ఇతర సేంద్రీయ పదార్థాల నుంచి పొందిన సౌరశక్తి పునరుత్పాదక మూలం
బి) ఇది శిలాజ ఇంధనాల నుంచి లభించే పునరుత్పాదక శక్తి వనరు
సి) ఇది అణు విచ్ఛిత్తి నుంచి పొందే శక్తి వనరు
డి) ఇది సౌరశక్తి నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్ నుంచి పొందే శక్తి వనరు సమాధానం: ఎ
వివరణ: ప్రపంచ వ్యాప్తంగా సమృద్ధిగా లభించే బయోమాస్ పునరుత్పాదక శక్తి వనరు. వివిధ సేంద్రీయ వనరుల నుంచి బయోమాస్ అని పిలిచే జీవశక్తిని తయారు చేస్తారు. శక్తి ఉత్పత్తి కోసం జంతువుల వ్యర్థ పదార్థాలు, అటవీ వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాలను ఉపయోగిస్తారు.
పెరుగుతున్న శక్తి డిమాండును తీర్చడానికి బయోఎనర్జీ సహాయపడుతుంది. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడం ద్వారా వాతావరణ మార్పుల్లో అసాధారణ మార్పులను కొంతమేరకు నివారించవచ్చు.
మార్కెట్ వృద్ధి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధన వ్యవస్థల మార్కెట్ భారత్లో విపరీతంగా పెరగనున్నాయి.
ఆదాయ కల్పన: జీవ ఇంధనాలను ప్రత్యామ్నాయ శక్తి వనరుగా స్వీకరించడం ద్వారా రైతుల
ఆదాయాన్ని గణనీయంగా పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చు.
దిగుమతులు తగ్గించడం: దిగుమతుల ద్వారానే అత్యధికంగా భారతదేశ ఇంధన అవసరాలు తీరుతున్నాయి. ఈ దిగుమతులను తగ్గించడానికి బయోఎనర్జీ తోడ్పడుతుంది. భారతదేశ ఇంధన భద్రత, స్వావలంబనను పెంచుతుంది.
జీవశక్తిని అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ ప్రయత్నాలు
మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యువబుల్ ఎనర్జీ (ఎంఎన్ఆర్ఈ) 2022 నాటికి 10 గిగావాట్ల స్థాపిత బయోమాస్ విద్యుత్తును సాధించాలని జాతీయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
జీవ ఇంధనాలపై జాతీయ విధానం: ఈ విధానం 2030 నాటికి శిలాజ ఆధారిత ఇంధనాలతో జీవ ఇంధనాలను 20% కలపడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఆర్థిక ప్రోత్సాహకాలు: బయోమాస్ ప్రాజెక్టులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను అందిస్తారు. యంత్రాలు, విడిభాగాలకు కస్టమ్స్, ఎక్సైజ్ సుంకం మినహాయింపు కొన్ని రాష్ర్టాల్లో అమ్మకపు పన్ను మినహాయింపు లభిస్తుంది.
బయోఎనర్జీ వనరులపై ఆధారపడటం ద్వారా 2050 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి భారతదేశం ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించింది.
భారతదేశ సామర్థ్యం: భారతదేశంలో సుమారు 18,000 మెగావాట్ల బయోమాస్ సామర్థ్యం ఉందని అంచనా.
బయోమాస్ ఆధారిత విద్యుత్ సామర్థ్యం: ప్రస్తుతం భారత్లో 9,868 మెగావాట్ల బయోమాస్ ఆధారిత విద్యుత్ సామర్థ్యం ఉంది.
ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యం: 2030 నాటికి పెట్రోల్ (గ్యాసోలిన్)లో ఇథనాల్ను 20% కలపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
బయోడీజిల్ బ్లెండింగ్ లక్ష్యం: 2030 నాటికి 20 శాతం బయోడీజిల్ను డీజిల్తో కలపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
బయో ఎనర్జీ రకాలు: బయోఫ్యూయల్స్, బయోమాస్ పవర్, బయోగ్యాస్, బయోచార్.
కె.భాస్కర్ గుప్తా
బీసీ స్టడీసర్కిల్,