వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించినదే కామర్స్ రంగం. అత్యధికస్థాయిలో ఉద్యోగావకాశాలు కామర్స్ రంగంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే కామర్స్ కోర్సులు చదివినవారెవరు ఖాళీగా ఉండరు. కామర్స్ కోర్సులు చదివినవారు ఉద్యోగాలకు వెళ్లవచ్చు. ప్రొఫెషనల్ కోర్సులు చదివినవారైతే సొంతంగా ప్రాక్టీసు పెట్టుకోవచ్చు. ఏదీకాదు అనుకుంటే వారే స్వయంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. కామర్స్ కోర్సులకు ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఈ తరుణంలో ఇంటర్ తర్వాత ఎలాంటి కామర్స్ కోర్సులు చదివితే భవిష్యత్తు ఉంటుంది, కామర్స్ నిపుణులుగా ఎలా స్థిరపడవచ్చు వంటి పలు అంశాల గురించి విశ్లేషణ.
-దేశవ్యాప్తంగా జీఎస్టీ (వస్తు, సేవా పన్ను) అమల్లోకి రావడంతో చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ)లకు, ఇతర కామర్స్ ప్రొఫెషనళ్లకు ఉపాధి అవకాశాలు బాగా పెరిగాయి.
-ప్రస్తుత సమాజంలో యువ వ్యాపారవేత్తల అవసరం రోజురోజుకీ పెరిగిపోతుంది. దీనికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్థలను నెలకొల్పే యువ పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. పెరుగుతున్న ఆర్థిక అవసరాల దృష్ట్యా కామర్స్, ఆర్థిక నిపుణులు, యువ పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యం పెరుగుతుంది.
-బెంగళూరు, ముంబై, న్యూఢిల్లీ వంటి ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ర్టాల్లో కామర్స్ కోర్సులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ అన్ని కాలేజీల్లో సైన్స్ గ్రూపుల కంటే ముందు కామర్స్ గ్రూపుల సీట్లు భర్తీ అవుతుండటమే దీనికి సాక్ష్యం. తెలుగు రాష్ర్టాల్లో గతంలో సైన్స్ గ్రూపులకే ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కామర్స్ కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది.
-ఆర్థిక కార్యకలాపాలను ముందుండి నడిపే కామర్స్ నిపుణులకు రాబోయే రోజుల్లో అవకాశాలు విస్తృతం కానున్నాయి.
-కామర్స్ కోర్సుల్లో సీఏ, సీఎంఏ, సీఎస్, బీకామ్, ఎంబీఏ కోర్సులను ప్రధానమైనవి.
సీఎంఏ కోర్సు
-సీఏ కోర్సు తర్వాత విద్యార్థులు ఈ కోర్సువైపు విశేషంగా ఆకర్షితులవుతున్నారు.
-ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ చదివిన విద్యార్థులైతే ఇంటర్ తర్వాత కేవలం రెండేండ్లలో ఇంటర్ తర్వాత సీఎంఏ చదవడం మొదలుపెట్టిన విద్యార్థులైతే రెండున్నరేండ్లలో పూర్తిచేసి మంచి ఉద్యోగావకాశాలు సంపాదించవచ్చు. సీఎంఏకు ఇంటర్మీడియట్లోని ఏగ్రూపువారైనా అర్హులే.
-సీఎంఏ చదవాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. దీనికోసం విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి. రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు ఇన్స్టిట్యూట్వారు ఐడీకార్డ్ ఇస్తారు. ఈ ఐడీకార్డ్ ఉన్న విద్యార్థులను మాత్రమే పరీక్షలకు అనుమతిస్తారు.
సీఎంఏలోని దశలు
-సీఎంఏలో ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ అనే మూడు దశలుంటాయి.
-సీఎంఏ ఫౌండేషన్ కోర్సు: సీఎంఏ కోర్సు మొదటి దశను ఫౌండేషన్ అని వ్యవహరిస్తారు. ఇంటర్ ఏ గ్రూపు చదివినవారైనా సీఎంఏ ఫౌండేషన్ కోర్సు కోసం నమోదు చేయించుకొని చదవవచ్చు. అదే ఇంటర్ ఎంఈసీ విద్యార్థులైతే ఇంటర్ ఎంఈసీతోపాటు సీఎంఏ ఫౌండేషన్ కోర్సును సమాంతరంగా పూర్తిచేయవచ్చు. సీఎంఏ ఫౌండేషన్ కోర్సులోని మొత్తం 8 సబ్జెక్టులను నాలుగు పేపర్లుగా విభజించారు. అంటే రెండు సబ్జెక్టులు కలిపి ఒక పేపర్. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను నాలుగు పేపర్లుగా విడివిడిగా (రోజుకో పేపర్ చొప్పున పరీక్ష ఉంటుంది). అలాగే ప్రతి పేపర్లో 100 మార్కులకు ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు.
-సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను నాలుగు పేపర్లు కలిపి మొత్తం 400 మార్కులకు నిర్వహిస్తారు. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే విద్యార్థి 400 మార్కులకుగాను 200 మార్కులు అంటే 50 శాతం మార్కులు లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. అలాగే ప్రతి పేపర్లోనూ 40 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. సీఎంఏ ఫౌండేషన్ పరీక్షను జూన్, డిసెంబర్లో ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తారు.
-ఫౌండేషన్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థులు సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సు చదవడానికి అర్హత సాధిస్తారు.
-సీఎంఏ-ఇంటర్ కోర్సు (సీఎంఏ-ఎగ్జిక్యూటివ్ కోర్సు): సీఎంఏ ఫౌండేషన్ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు సీఎంఏ ఇంటర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్షను రాయడానికి అర్హులు.
-ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో సీఎంఏ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. సీఎంఏ ఇంటర్మీడియట్ కోర్సు రెండు గ్రూపులుగా ఉంటుంది.
-సీఎంఏ ఇంటర్లోని రెండు గ్రూపుల్లో మొదటి గ్రూపు-1లో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్లో కనీసం 40 మార్కులు సాధించి మొత్తంగా 50 శాతం మార్కులతో 200, ఆపై మార్కులు సాధించినవారే ఉత్తీర్ణులవుతారు.
-సీఎంఏ ఇంటర్ గ్రూప్-2లో కూడా 4 పేపర్లు ఉంటాయి. ఈ గ్రూప్లో కూడా ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. అలాగే గ్రూప్ మొత్తంమీద 50 శాతం మార్కులు అంటే 200 ఆపై మార్కులు స్కోర్ చేయాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. సీఎంఏ ఇంటర్ కోర్సు నమోదు చేసుకున్నవారు ఏడాది తర్వాత సీఎంఏ ఇంటర్ పరీక్ష రాయవచ్చు.
ప్రాక్టికల్ శిక్షణ
-సీఎంఏ ఫైనల్ రాయాలంటే ఆరు నెలల ప్రాక్టికల్ శిక్షణ తప్పనిసరి. సీఎంఏ ఎగ్జిక్యూటివ్ (సీఎంఏ ఇంటర్) ప్రోగ్రామ్లో ఉత్తీర్ణత సాధించినవారు ప్రాక్టికల్ శిక్షణ గుర్తింపు పొందిన సంస్థల్లో నిర్దేశించిన విభాగాల్లో లేదా ప్రాక్టీసింగ్ కాస్ట్ అకౌంటెంట్ దగ్గర 6 నెలలపాటు ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందాలి. ఇలా శిక్షణ కాలంలోనే విద్యార్థి తను ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతున్న ప్రాంతాన్నిబట్టి నెలకు రూ. 2000 – రూ. 5000 వరకు స్టయిఫండ్ పొందవచ్చు. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా విద్యార్థి సీఎంఏ వృత్తికి కావల్సిన నైపుణ్యాన్ని పొందడమే కాకుండా తన కోర్సు పూర్తిచేసుకోవడానికి కావల్సిన ఆర్థిక వనరులను సమకూర్చుకోవచ్చు. సీఎంఏ ఫైనల్ ఉత్తీర్ణులైనవారు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మూడేండ్ల ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాలి.
సీఎంఏ ఫైనల్
-6 నెలలు ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తయిన విద్యార్థి ఫైనల్ పరీక్ష రాయవచ్చు. సీఎంఏ ఫైనల్లో కూడా రెండు గ్రూపులు (గ్రూప్-3, 4) ఉంటాయి. ఫైనల్ పరీక్షకు అర్హత సాధించాలంటే విద్యార్థి కనీసం 6 నెలల ప్రాక్టికల్ శిక్షణ పూర్తిచేయాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపులు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు 6 నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలలో సీఎంఏ ఫైనల్కు పరీక్షలు జరుగుతాయి.
-ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు, గ్రూప్ మొత్తం 50 శాతం మార్కులు అంటే 400లకు 200 మార్కులు సాధించాలి.
రెండు, మూడు దశల్లో మార్పులు
-2018 మార్చి 1 నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (మాడ్యూల్ 1, 4 పేపర్లు, మాడ్యూల్ 2, 4 పేపర్లు)కు కొత్త సిలబస్ అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం మొదటి పరీక్ష డిసెంబర్ 2018 నుంచి నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ (మూడు మాడ్యూళ్లలో 9 పేపర్లు)కు 2018, సెప్టెంబర్ 1 నుంచి కొత్త సిలబస్ అమలవుతుంది. ఈ సిలబస్ ప్రకారం మొదటి పరీక్ష జూన్ 2019 నుంచి నిర్వహిస్తారు.
కంపెనీ సెక్రటరీలకు అవకాశాలు
-సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించి, వ్యాపార సామ్రాజ్యాన్ని తమ భుజస్కంధాలపై మోసేవారు కంపెనీ సెక్రటరీలు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకి సలహాలివ్వడం, కంపెనీ రిజిస్ట్రార్గా, కంపెనీకి న్యాయ సలహాలు అందిస్తూ, కంపెనీ విధానాల రూపకర్తగా, కంపెనీ చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, కంపెనీ ప్రిన్స్పల్ సెక్రటరీగా, యాజమాన్యానికి, వాటాదారులు, రుణదాతలకు అనుసంధానకర్తగా వంటి అనేక రూపాల్లో, హోదాల్లో ఉద్యోగం చేయవచ్చు.
బీకామ్ కోర్సు
-ఇంటర్ ఎంఈసీ/సీఈసీ తదితర కామర్స్ గ్రూపులు చదివిన విద్యార్థులు బీకామ్ కోర్సు చదవచ్చు.
-బీకామ్లో అకౌంట్స్, లా, అర్థశాస్త్రం, గణాంకశాస్త్రం, కాస్టింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, కంప్యూటర్ వంటివి ప్రధాన సబ్జెక్టులు.
-సీఏ లేదా సీడబ్ల్యూఏ లేదా సీఎస్ వంటి ప్రొఫెషనల్ కోర్సులు చదివే విద్యార్థులు కూడా దూరవిద్యా విధానంలో బీకామ్ చేయవచ్చు.
-విద్యార్థి ఆసక్తినిబట్టి బీకామ్లోని ఏదో ఒక విభాగాన్ని ఎంచుకోవచ్చు.
-డిగ్రీ తర్వాత ఎంకామ్, ఎంబీఏ, సీఏ, సీడబ్ల్యూ, సీఎస్ వంటి కోర్సులు చదవచ్చు.
ఎంబీఏ
-ఇంటర్ పూర్తిచేసినవారు ఏదో ఒక డిగ్రీ కోర్సు చదివి ఎంబీఏ లేదా ఎంసీఏ చదవచ్చు. కంప్యూటర్స్ తర్వాత విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తున్న కోర్సు ఎంబీఏ. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ కోర్సుకు డిమాండ్ అధికమవుతున్నది. ప్రైవేట్ కంపెనీల మధ్య పోటీతత్వం ఎంబీఏ కాలేజీలకు కూడా పాకింది. కంపెనీల అవసరాలకు అనుగుణంగా కొత్త స్పెషలైజేషన్లను ప్రవేశపెట్టడంతో కాలేజీలు పోటీపడుతున్నాయి.
-బహుళజాతి కంపెనీల ప్రవేశంతో పరిశ్రమల్లో పని సంస్కృతి మారుతున్నది. కంపెనీల్లో ధోరణులపై ఎప్పటికప్పుడు అవగాహన ఏర్పర్చుకోవాలి.
-భాషపై పట్టు సాధించాలి. నలుగురితో కలిసి పనిచేసే లక్షణాన్ని అలవరుచుకోవాలి.
-అంతర్జాతీయ వ్యాపారంలో పరిణామాలు, వివిధ దేశాల వ్యాపార సంస్కృతుల గురించి తెలుసుకోవాలి.
-మేనేజ్మెంట్కు అర్థశాస్త్రం, కంప్యూటర్స్, రాజనీతి-సమాజశాస్త్రంతోనూ సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇతర రంగాలు, అధ్యయన అంశాల్లో కూడా కొంత పరిజ్ఞానం సాధించాలి.
-ఎంబీఏకు సంబంధించిన అకడమిక్ జర్నళ్లు, వ్యాపార దినపత్రికలు క్రమం తప్పకుండా చదవాలి.
కామర్స్ నిపుణులకు కొలువులెక్కడ
-అన్ని రంగాలు, పరిశ్రమలు ఆర్థిక వ్యవహారాలతో ముడిపడి ఉన్నవే. వీటన్నింటిలో వివిధ విభాగాల్లో పనిచేయడానికి, అకౌంటింగ్ పనులు నిర్వహించడానికి, వాటితోపాటు సంస్థ ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇతర విభాగాల్లో సేవలు అందించడానికి ఎక్కువ మానవ వనరులు అవసరం. ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తే ఈ రంగంలో కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. కేవలం కామర్స్ రంగంలో విద్యార్హత మాత్రమే కాకుండా ఆయారంగాల్లో ఆసక్తులనుబట్టి చేరితే వృత్తిపరంగా చాలా వేగంగా ఎదగవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రంగాలు వాటిల్లో ఉండే కొలువుల గురించి తెలుసుకుంటే కెరీర్ను ప్రణాళికాబద్ధంగా డిజైన్ చేసుకోవచ్చు.
కంపెనీ సెక్రటరీ కోర్సు
-ఈ కోర్సును ఫౌండేషన్ ప్రోగ్రామ్, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్, ప్రొఫెషనల్ ప్రోగామ్ అనే మూడు స్థాయిల్లో పూర్తిచేయాలి.
సీఎస్ ఫౌండేషన్
-ఇంటర్లో ఏ గ్రూపువారైనా సీఎస్ కోర్సు చేయవచ్చు. డిగ్రీ పూర్తిచేసినవారు సీఎస్ ఫౌండేషన్ అవసరం లేకుండా నేరుగా సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ చదవచ్చు.
-ఈ పరీక్ష ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలలో నిర్వహిస్తారు. సీఎస్ ఫౌండేషన్ పరీక్ష డిసెంబర్లో రాయాలంటే ఆ ఏడాది మార్చి 31లోగా, జూన్లో రాయాలంటే ముందు ఏడాది సెప్టెంబర్ 30వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. సీఎస్ ఫౌండేషన్ పరీక్ష కూడా సీఏలోని సీపీటీ పరీక్షలానే ప్రవేశ పరీక్ష రూపంలో రాయాలి. ఇది మొత్తం 200 ప్రశ్నలు 400 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్ష పూర్తిగా కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. ఈ పరీక్షలో విద్యార్థి 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధించినట్టు ప్రకటిస్తారు.
-సీఎస్ ఫౌండేషన్లో ఉత్తీర్ణత సాధించినవారు నేరుగా ఎగ్జిక్యూటివ్ పరీక్ష (రెండు మాడ్యూల్స్గా 8 పేపర్లు) రాయవచ్చు. మాడ్యూల్లో ప్రతి పేపర్లో 40 శాతం మార్కులకు తగ్గకుండా మాడ్యూల్ మొత్తంమీద 50 శాతం మార్కులు సాధించాలి. ఈ పరీక్ష కూడా జూన్, డిసెంబర్లలో ఉంటుంది.
అప్రెంటిస్షిప్
-సీఎస్ కోర్సు పూర్తిచేయాలంటే రాత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా అప్రెంటిస్ పేరుతో ఉండే ప్రాక్టికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా పూర్తి చేయాలి. ఇది గరిష్ఠంగా మూడేండ్లు ఉంటుంది. అయితే అభ్యర్థులు సీఎస్ కోర్సు ఏ దశలో చేరారనే దానికి అనుగుణంగా ఈ వ్యవధిలో మార్పులు ఉంటాయి.
-ఎగ్జిక్యూటివ్ పరీక్ష రాసిన తర్వాత ప్రొఫెషనల్ పరీక్ష (మూడు మాడ్యూళ్లు, 9 పేపర్లు) రాయాలి. అన్ని పేపర్లలో కలిపి 50 శాతం సగటు మార్కులు సాధిస్తే విద్యార్థి మాడ్యూల్/ప్రొఫెషనల్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటిస్తారు.