న్యూఢిల్లీ: 10వ, 12వ తరగతి విద్యార్థుల పరీక్షల నమూనాలో ఇప్పటికిప్పుడు ఎలాంటి మార్పులు ఉండబోవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రకటించింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన ప్యాటర్న్ ప్రకారమే CBSE టర్మ్-2 పరీక్షలు జరుగుతాయని స్పష్టంచేసింది. సిలబస్ విషయంలో కూడా CBSE క్లారిటీ ఇచ్చింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో టర్మ్-2 పరీక్షల కోసం సిలబస్ను హేతుబద్దీకరించామని, తర్వాత జరుగబోయే పరీక్షల కోసం అప్పటి కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
సిలబస్, ఎగ్జామ్స్ ప్యాటర్న్ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకునే వరకు విద్యార్థులు పాత ప్యాటర్న్, రేషనలైజ్ చేసిన సిలబస్ను పరిగణలోకి తీసుకుని పరీక్షలకు ప్రిపేర్ కావాలని సీబీఎస్ఈ సూచించింది. ఇటీవల CBSE 10వ, 12వ తరగతి పరీక్షల ప్యాటర్న్ను మార్చబోతున్నదని ప్రచారం జరిగింది. దాంతో విద్యార్థులు ఏ ప్యాటర్న్ ప్రకారం పరీక్షలకు సన్నద్ధం కావాలనే విషయంలో కొంత అయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో CBSE విద్యార్థుల అయోమయానికి తెరదించుతూ స్పష్టమైన ప్రకటన చేసింది.