UGC Initiative | విదేశాల్లో చదువాలనే కోరిక తీర్చుకునేందుకు ఎందరో విద్యార్థులు ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శుభవార్త చెప్పింది. విదేశీ వర్శిటీల విద్యాభ్యాసాన్ని భారతీయ విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. భారత్కు చెందిన విద్యా సంస్థలతో కలిసి పనిచేసేందుకు 49 విదేశీ విశ్వవిద్యాలయాలు ముందుకొచ్చాయి. త్వరలో ఇవి టై అప్ కానున్నాయని యూజీసీ హెచ్ ఎం జగదీశ్ కుమార్ చెప్పారు.
భారత్లోని విద్యాసంస్థలతో టై ఆప్ చేసుకునే విదేశీ విశ్వవిద్యాలయాల్లో మిచిగాన్ యూనివర్శిటీ, సిడ్నీ యూనివర్శిటీ, మెల్బోర్న్ వర్శిటీ, బర్మింగ్హమ్ విశ్వవిద్యాలయం, లండన్లోని క్వీన్ మేరీ విశ్వవిద్యాలయం, ఇల్లినాయిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్శిటీ ఆఫ్ మలయా, ఇజ్రాయెల్కు చెందిన హఫియా యూనివర్శిటీ వంటి 49 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని జగదీశ్ కుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న 230 భారతీయ, 1256 విదేశీ ఉన్నత విద్యా సంస్థలను యూజీసీ గుర్తించినట్లు ఆయన చెప్పారు.
ఈ విదేశీ విశ్వవిద్యాలయాల టై ఆప్ కారణంగా భారత్లో ఉంటూనే ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్శిటీల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. ఇది విద్యార్థుల కెరీర్ను అభివృద్ధి చేసుకునేందుకు లాభపడటమే కాకుండా తక్కువ ఖర్చుతో విదేశీ డిగ్రీని పొందే వీలుంటుంది. విదేశీ విశ్వవిద్యాలయాల టై ఆప్ కింద మూడు రకాల డిగ్రీల ప్రోగ్రాంకు యూజీసీ ఆమోదం తెలిపింది. ఇందులో డ్యూయల్, జాయింట్, ట్విన్నింగ్ డిగ్రీలు ఉన్నాయి. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద రెండు కాలేజీలు ఒకే సబ్జెక్టులో డిగ్రీ ఇస్తాయి. జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలో రెండు ఇన్స్టిట్యూట్లు ఒకేసారి రెండు వేర్వేరు సబ్జెక్టుల్లో డిగ్రీలను ప్రదానం చేస్తాయి. ఇక చివరి ప్రోగ్రాం ట్విన్నింగ్లో ఎక్కువ భాగం విదేశాల్లో విద్యాభ్యాసం ఉంటుంది. విదేశీ యూనివర్శీటీలే డిగ్రీలను అవార్డ్ చేస్తాయి.