కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి పదవి నుంచి.. కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డికి ప్రముఖుల నుండి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కిషన్ రెడ్డికి తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మనదేశ ప్రత్యేకతలు, యోగ్యతలను ప్రపంచానికి చాటి చెప్పడానికి కిషన్ రెడ్డికి మంచి అవకాశం లభించింది. మీరు ఇలాగే కృషి చేస్తూ మన భారతీయ చరిత్రాత్మక సంపదను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చిరు పేర్కొన్నారు.
గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చిరంజీవి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించగా, ఆ అనుభూతిని, అధికారాన్ని అనుభవించినందుకు థ్రిల్లింగ్గా ఉందని చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. పెద్ద సంఖ్యలో కొత్త మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులలోనూ కొందరికి శాఖలు మారాయి. విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది.