హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ కార్యాలయాలను జూన్ నుంచి ప్రాధాన్యక్రమంలో టీ-ఫైబర్తో కనెక్ట్ చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఫైబర్గ్రిడ్ ప్రాజెక్ట్ పరిధిని తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలకు విస్తరించాలని చెప్పారు. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. గురువారం టీ హబ్లో జరిగిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ బోర్డు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ ఇవ్వాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ పనుల పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. మిషన్ భగీరథ పనులు పూర్తయిన గ్రామీణ ప్రాంతాల్లో టీ ఫైబర్ పనులు పెద్దఎత్తున కొనసాగుతున్నాయని, ఈ సంవత్సరంలో ఆగస్టు నాటికి ప్రతి గ్రామానికి టీ ఫైబర్ కనెక్టివిటీ అందించే లక్ష్యంతో పని చేస్తున్నామని టీ-ఫైబర్ అధికారులు మంత్రి కేటీఆర్కు తెలిపారు. సీఎం కేసీఆర్ సూచనమేరకు రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలను టీ-ఫైబర్తో అనుసంధానం చేయాలని, ప్రతి రైతుకు ఇంటర్నెట్ ఫలాలు అందించాలని కేటీఆర్ చెప్పారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా 5 రైతు వేదికలకు కనెక్టివిటీని అందించామని టీ ఫైబర్ బృందం ప్రతినిధులు మంత్రికి సమాచారమిచ్చారు. బ్రాండ్బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించే అంశాన్ని పరిశీలించి, తద్వారా పట్టణాల్లోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ చేరుకొనే విధానాన్ని అధ్యయనం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను సూచించారు. బోర్డు ఆదేశాల మేరకు టీ ఫైబర్ను వేగంగా ముందుకు తీసుకొనిపోయేందుకు కృషిచేస్తామని టీ ఫైబర్ ఎండీ సుజయ్ కారంపూడి అన్నారు. ప్రాజెక్టు పురోగతికి సహకరిస్తున్న మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రొనాల్డ్ రాస్, మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్రెడ్డి పాల్గొన్నారు.